జిగేల్‌మనే అవిన్యా...ఈవీ!

2 May, 2022 17:52 IST|Sakshi

ఆ కారును చూస్తే కళ్లు జిగేల్‌మంటాయి. కారు పైభాగమే కాదు.. లోపలి భాగం కూడా అదిరిపోయేలా ఉంది. దీన్ని చూస్తే ఏ విదేశీ కారో అయిఉంటుందని భావిస్తారు. అయితే, దేశీయ కార్ల దిగ్గజం టాటా మోటార్స్‌ ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ వాహన కాన్సెప్ట్‌ అవిన్యాను ఆవిష్కరించి అబ్బురపరిచింది. స్పోర్టీ లుక్‌తో కట్టిపడేసేలా ఉన్న ఈ జెన్‌–3 కారు విశేషాలేంటో ఓ లుక్కేద్దాం..

రెండో తరం ‘కర్వ్‌ ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్‌’ తర్వాత టాటా కంపెనీ తాజాగా ‘అవిన్యా ఈవీ కాన్సెప్ట్‌’ కారును ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 500 కిలోమీటర్ల దూరానికిపైగా ప్రయాణిం చవచ్చు. విద్యుత్‌ వాహనాల్లో మూడో తరం ఆర్కిటెక్చర్‌ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందించారు. సంస్కృత పదమైన అవిన్యా అంటే వినూత్నత అని అర్థం. ఈ కారే ఒక విశేషమనుకుంటే అందులోని అన్ని ఫీచర్స్‌ కూడావేటికవే ప్రత్యేకతను సంతరించు కున్నాయి. అయితే, దీన్ని సొంతం చేసుకోవాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే. 2025 నాటికల్లా మార్కెట్‌లోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్‌పైనే దృష్టిపెట్టినప్పటికీ.. విదేశాలకు కూడా దీన్ని ఎగుమతి చేస్తామని చెప్పింది.

ఫీచర్లు
- ముందు సీట్లు 360 డిగ్రీలు తిరిగేలా అమర్చారు. కేబిన్‌ నుంచి ముందు సీటుతోపాటు వెనుక సీట్లను కూడా సులభంగా యాక్సెస్‌ చేయొచ్చు.
 - పెద్ద టచ్‌స్క్రీన్‌తో యూనిక్‌ డిజైన్‌తో ఉన్న స్టీరింగ్‌. డ్రైవర్‌ డిస్‌ప్లేతోపాటు మరో రెండు చిన్నపాటి స్క్రీన్లు కూడా ఉన్నాయి. 
 - విండ్‌షీల్డ్‌ కింద బ్యాటరీ చార్జింగ్‌లాంటి ఫీచర్లు కనిపించేలా మరో డిజిటల్‌ డిస్‌ప్లే ఉంది. ఇది డ్రైవర్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది.
 - ఇంటీరియర్‌ అధునాతన శైలిలో ఉంది. లోపల ఎక్కువ స్పేస్‌ ఉండటంపై దృష్టిపెట్టి సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్‌ చేశారు. 
- కారు ముందు, వెనుకవైపున్న ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ లైట్స్‌ దీనికి ప్రత్యేక ఆకర్షణ. కంపెనీ లోగో ‘టీ’ ఆకారంలో ఈ లైట్‌ స్ట్రిప్‌ ఉంది. 
 - చేతులు పెట్టుకునే చోట వివిధ రకాల కంట్రో ల్‌ బటన్స్‌ ఉన్నాయి. లోపల కూర్చున్న వారికిది చాలా సౌలభ్యంగా ఉంటుంది.
 - అత్యాధునిక సాంకేతికత, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది
 - వాటర్‌ప్రూఫ్, దుమ్ము నుంచి రక్షణతో పాటు ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ దీని సొంతం
- కర్బన ఉద్గారాలను తగ్గించేలా అధునాతన మెటీరియల్‌తో చక్రాలు రూపొందించారు
- కారుపైభాగం అద్దంతో రూపొందించడం వల్ల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణాన్ని మరింత ఆస్వాదించవచ్చని అంటున్నారు. 

టార్గెట్‌ 2030
2030 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేయాలన్న ప్రభుత్వ లక్ష్యం దిశగా పయనిస్తున్నామని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. ఫస్ట్‌ జనరేషన్‌ విద్యుత్‌ వాహనాలు ఒకసారి చార్జింగ్‌ చేస్తే 250 కి.మీ వరకు వెళ్లగా, రెండో తరానికి చెందినవి 400–500 కి.మీ వరకు వెళ్తాయని, జెన్‌–3 కార్లయితే 500 కి.మీ.కుపైగా వెళ్తాయని ఆయన తెలిపారు. 

చదవండి: హ్యుందాయ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ కారు.. మైలేజ్‌, మ్యాగ్జిమమ్‌ స్పీడ్‌ ఎంతంటే?

మరిన్ని వార్తలు