ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో, విస్తారాకు భారీ జరిమానా

2 Jun, 2022 13:34 IST|Sakshi

DGCA Fines Vistara, సాక్షి, ముంబై: విమానయాన సంస్థ విస్తారాకు భారీ షాక్‌ తగిలింది. సరియైన శిక్షణ లేని పైలట్‌కు విమాన ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినందుకుగాను  సంస్థకు భారీ జరిమానా విధించింది. రూ. 10 లక్షల పెనాల్టీ విధిస్తూ  ఏవియేషన్  రెగ్యులేటరీ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. సిమ్యులేటర్‌ శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో  విస్తారా విమానాన్ని ల్యాండ్‌ చేశారనేది ఆరోపణ. అయితే ఈ విమానం ఎక్కడ నుండి బయలుదేరింది, ఎప్పుడు జరిగింది  అనేది స్పష్టత లేదు. 

ఇండోర్ విమానాశ్రయంలో సరైన శిక్షణ లేని పైలట్ ప్రయాణీకుల విమానాన్ని ల్యాండింగ్‌కు  అనుమతించినందుకు విస్తారాపై రూ. 10 లక్షల జరిమానా విధించినట్లు డీజీసీఏ అధికారులు గురువారం తెలిపారు. విమానంలో పైలట్, సిమ్యులేటర్‌లో అవసరమైన శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారని పేర్కొన్నారు. ఇది విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్య అంటూ  అధికారులు  మండిపడ్డారు.

ప్రయాణీకులతో కూడిన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందుగా సిమ్యులేటర్‌లో పైలట్‌కు శిక్షణ ఇవ్వాలి. విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించే ముందు కెప్టెన్ కూడా సిమ్యులేటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుంది.  కెప్టెన్‌, పైలట్‌ ఇద్దరికీ శిక్షణ లేదనీ, ఇది చాలా తీవ్రమైన విషయమంటూ, నిబంధనలు ఉల్లఘించిన విస్తారాపై ఆగ్రహం వ్యక్తం  చేసింది.  


 

మరిన్ని వార్తలు