ఐపీవోకు పేటీఎమ్‌,రూ.16,600 కోట్లు సమీకరణే లక్ష్యంగా

17 Jul, 2021 07:26 IST|Sakshi

సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ దాఖలు

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది.ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 16,600 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీవోలో భాగంగా జారీ చేయనుంది. మరో రూ. 8,300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మతోపాటు చైనీస్‌ గ్రూప్‌ అలీబాబా, తదితర సంస్థలు వాటాలను ఆఫర్‌ చేయనున్నాయి.  
నిధుల వినియోగం..: అలీబాబా కనీసం 5 శాతం వాటాను విక్రయించనుండగా.. సయిఫ్‌  3 మారిషస్, సయిఫ్‌ పార్ట్‌నర్స్, బీహెచ్‌ ఇంటర్నేషనల్‌ ఉన్నాయి. ఐపీవో నిధులలో రూ. 4,300 కోట్లను బిజినెస్‌ పటిష్టత, విస్తరణ, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేటీఎమ్‌ పేర్కొంది. గతేడాది(2020–21) రూ. 3187 కోట్ల ఆదాయం సాధించింది.  2019–20లో రూ. 3,541 కోట్ల టర్నోవర్‌తో పోలిస్తే తగ్గింది. అయితే ఇదే కాలంలో నష్టాలు రూ. 2,943 కోట్ల నుంచి రూ. 1,704 కోట్లకు తగ్గినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలిపింది. 

చదవండి: నీ లుక్‌ అదిరే సెడాన్‌, మెర్సిడెస్‌ నుంచి రెండు లగ్జరీ కార్లు

మరిన్ని వార్తలు