అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్‌ రేడియోకు అదరిపోయే వార్త

5 Aug, 2022 08:35 IST|Sakshi

డిజిటల్‌ రేడియోతో ఆదాయ వృద్ధి 

న్యూఢిల్లీ: డిజిటల్‌ రేడియో టెక్నాలజీ వినియోగంతో రేడియో విభాగం ఆదాయం అయిదేళ్లలో రెండింతలై రూ.12,300 కోట్లకు చేరుకుంటుందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ), ఈవై నివేదిక వెల్లడించింది. ‘డిజిటల్‌ రేడియోతో ప్రసార కంపెనీలు, శ్రోతలు, ప్రకటనకర్తలు, నియంత్రణ సంస్థలకు ప్రయోజనం. అధిక ధరలతో స్లాట్స్‌ విక్రయించేలా ప్రకటనలు పెరుగుతాయి.

డిజిటల్‌ రేడియో వ్యవస్థ శ్రోతల డేటాను పారదర్శకంగా అందిస్తుంది. ఎంతమంది వింటున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి ప్రసారకులు నమ్మకాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఆదాయాన్ని పెంచుకోవచ్చు. చానెళ్లూ పెరుగుతాయి. ప్రస్తుతం ఉన్న ఫ్రీక్వెన్సీలో నాలుగింతలు ఎక్కువగా చానెళ్లను ఆఫర్‌ చేయవచ్చు. నాణ్యత అధికం అవుతుంది. శ్రోతలకు మెరుగైన అనుభూతి కలుగుతుంది. అదనపు స్పెక్ట్రమ్‌ అవసరం లేకుండానే చానెళ్ల సంఖ్య ప్రస్తుతమున్న 300 నుంచి 1,100 దాటుతుంది. కొన్నేళ్లుగా ఆదాయాల ఆర్జనకు ఎఫ్‌ఎం రేడియో కష్టాలను ఎదురీదుతోంది’ అని నివేదిక వివరించింది.
 

మరిన్ని వార్తలు