ఎస్‌బీఐ చైర్మన్‌గా దినేష్‌ కుమార్‌ ఖరా

7 Oct, 2020 07:50 IST|Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నోటిఫికేషన్‌  

సాక్షి, న్యూఢిల్లీ:ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దినేష్‌ కుమార్‌ ఖరా మూడేళ్ల కాలానికి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎస్‌బీఐ చైర్మన్‌గా రజనీష్‌కుమార్‌ మూడేళ్ల పదవీ కాలం మంగళవారంతో ముగిసిపోయింది. దీంతో రజనీష్‌ స్థానంలో ఖరాను మూడేళ్ల కాలానికి లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎస్‌బీఐ తదుపరి చైర్మన్‌గా ఖరాను సిఫారసు చేస్తూ బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) గత నెలలోనే నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ ఎండీలుగా పనిచేస్తున్న వారిలో సీనియర్‌ను చైర్మన్‌గా నియమించే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. దినేష్‌ ఖరా 2016 ఆగస్ట్‌లో ఎస్‌బీఐ ఎండీగా మూడేళ్ల కాలానికి తొలుత నియమితులయ్యారు. ఆయన పనితీరు ఆశాజనకంగా ఉండడంతో రెండేళ్ల పొడిగింపు పొందారు. ఎస్‌బీఐ గ్లోబల్‌ బ్యాంకింగ్‌ డివిజన్‌ హెడ్‌గానూ పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ఫాకుల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ పూర్వ విద్యార్థి అయిన ఖరా.. 1984లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ అధికారిగా చేరి ప్రతిభ ఆధారంగా పదోన్నతులను పొందారు.

మరిన్ని వార్తలు