91 ఏళ్ల వయసులో..ఎనర్జిటిక్‌ షీనా లవ్‌లో బిజినెస్‌ టైకూన్‌

27 Feb, 2023 20:47 IST|Sakshi

సాక్షి, ముంబై: రియల్ ఎస్టేట్ గ్రూప్ డీఎల్‌ఎఫ్‌ ఎమెరిటస్ చైర్మన్ కుశాల్ పాల్ సింగ్ (91) మళ్లీ ప్రేమలో పడ్డారు.  తనకు ప్రేమ లభించిందంటూ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2018లో కేన్సర్‌తో  తన భార్య చనిపోయిన తరువాత ఒకటి రెండేళ్లు ఒంటరితనంతో  బాధపడ్డానని కానీ ఆ తరువాత చాలా గొప్ప వ్యక్తిని కలుసుకోవడం అదృష్టమంటూ తన కొత్త ప్రేమను పరిచయం చేయడం బిజినెస్‌ వర్గాల్లో విశేషంగా నిలిచింది.  

65 ఏళ్ల  తరువాత  భార్య  ఇందిర క్యాన్సర్‌తో  చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఒంటరి తనం కుదిపేసిందని చెప్పుకొచ్చారు. ఆమెతో అద్భుతమైన వైవాహిక జీవితాన్ని గడిపాను. ఆమె  భార్య మాత్రమే కాదు, స్నేహితురాలు కూడా. కానీ ఆమెను రక్షించు కోలేకపోయాం. అయితే చని పోవడానికి ఆరు నెలల ముందు, జీవితాన్ని వదులు కోవద్దని కోరిందనీ, తన జీవితం ఎలాగూ తిరిగి రాదు.. కానీ మీ జీవితం ఇంకా చాలా ఉంది.. దాన్ని వదులుకోవద్దంటూ తనతో వాగ్దానం చేయించు కుందని గుర్తు చేసుకున్నారు.

నిజానికి ఈ మాటలు నాతోనే ఉండిపోయాయన్నారు. కానీ ఈ విషయంలో తాను అదృష్టంతుడినని, ప్రస్తుతం  షీనాతో కలిసి జీవిస్తున్నానని వెల్లడించారు.  షీనా చాలా ఎనర్జిటిక్. అందుకే తానెఫ్పుడైనా డల్‌గా ఉన్నా యాక్టివ్‌గా మార్చేస్తుంది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్నేహితులు ఆమెకు ఉన్నారని ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె చాలా ప్రేరణ నిస్తుంది. తన జీవితంలో ముఖ్య భాగమైన షీనా అండతో తానిపుడు చలాకీగా పనిలో నిమగ్నమయ్యానని చెప్పడం విశేషం. దీంతో పాటు  కరియర్‌ ప్రారంభలో తన అనుభవాలను కూడా పంచుకున్నారు.  

కాగా ఫోర్బ్స్ ప్రకారం సింగ్ నికర విలువ 8.81 బిలియన్‌ డాలర్లు. 1946లో తన మామగారు ప్రారంభించిన డీఎల్‌ఎఫ్‌ అనే కంపెనీలో చేరడానికి ముందు 1961లో ఆర్మిలో పనిచేశారు. ఆ తరువాత  రైతుల నుండి భూమిని సేకరించడం ద్వారా ఢిల్లీ శివార్లలో తన షోపీస్ టౌన్‌షిప్ గుర్గావ్‌లో డీఎల్‌ఎఫ్‌ సిటీని నిర్మించారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆ పదవిలో ఉన్న  ఆయన  జూన్ 2020లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇపుడు ఆయన కుమారుడు రాజీవ్ చైర్మన్‌గా  ఉన్నారు.

మరిన్ని వార్తలు