రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్న డీమార్ట్‌ ఓనర్‌

3 Apr, 2021 19:25 IST|Sakshi
డీమార్ట్‌ ఓనర్‌ రాధకిషన్‌ దమాని (ఫైల్‌ ఫోటో)

దక్షిణ ముంబైలోని మలబార్‌ ప్రాంతలో ఇంటి కొనుగోలు

స్టాంప్‌ డ్యూటే ఏకంగా రూ. 30 కోట్లు

సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్‌, డీమార్ట్‌ సంస్థ యజమాని రాధాకిషన్ దమాని సుమారు 1,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్‌లో ఆయన ఈ ఇంటిని తన సోదరుడు గోపీకిషన్‌ దమానితో కలిసి కొనుగోలు చేశారు. 5,752.22 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి ఖరీదు1,001 కోట్ల రూపాయలు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కోసం దమాని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖకు ఇప్పటికే రూ.30 కోట్లు చెల్లించారు. ఇక దీని మార్కెట్‌ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచాన వేస్తున్నారు.

ఈ ఇంటిని దమాని సౌరభ్‌ మెహతా, వర్షా మెహతా, జయేశ షా వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దమాని ముంబైలోని ఆల్టమౌంట్‌ రోడ్‌లోని పృథ్వి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిని దమాని పురచంద్ రాయ్‌చంద్ అండ్‌ సన్స్ ఎల్‌ఎల్‌పీ, పరేష్‌చంద్ రాయ్‌చంద్ అండ్‌ సన్స్ ఎల్‌ఎల్‌పీ, ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్‌ సన్స్ ఎల్‌ఎల్‌పీ భాగస్వాముల నుంచి కొనుగోలు చేశారు.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, రాధాకిషన్ దమాని 14.5 బిలియన్‌ డాలర్ల ఆస్తితో భారతీయ సంపన్నుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. భారతదేశంలో 209 మంది బిలియనీర్లు ఉండగా, వారిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముకేష్ అంబానీ 85 బిలియన్ డాలర్ల ఆస్తులతో భారతీయ సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు.

చదవండి: క‌రోనా వ‌ల్ల లాభ‌ప‌డింది ఆ ఒక్కరే

మరిన్ని వార్తలు