Dolo-650: వెయ్యికోట్ల ఫ్రీబీస్‌, ఐపీఏ సంచలన రిపోర్టు 

10 Sep, 2022 18:20 IST|Sakshi

న్యూఢిల్లీ: డోలో-650 తయారీదారు మైక్రో ల్యాబ్‌ డాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల లంచాలు అందించిందన్న వార్త నిజం కాదా? దేశీయ ఫార్మా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ)  రిపోర్టు ఇదే తేల్చింది. 

వెయ్యికోట్ల రూపాయల ఉచితాలను అందించిందనేది కరెక్ట్‌ కాదని నేషనల్ ఫార్మా స్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ)కి ఐపీఏ సమర్పించిన పరిశోధనా నివేదిక వెల్లడించింది. కంపెనీ వివరణలో సింగిల్‌ బ్రాండ్ డోలో, ఫ్రీబీస్‌పై రూ. 1000 కోట్లు ఖర్చు చేసిందనేది కరెక్టే. కానీ ఒక్క ఏడాదిలో అనేది సరైంది కాదని నివేదించింది. ఒక సంవత్సరంలో (మైక్రో ల్యాబ్స్) 1000 కోట్ల ఖర్చు చేసినట్టుగా తప్పుగా ప్రచారం చేశారని ఐపీఏ పేర్కొంది.

కంపెనీ మొత్తం టర్నోవర్ రూ. 4500 కోట్లు, అందులో దాదాపు రూ. 2500 కోట్ల దేశీయ విక్రయాలు. గత నాలుగేళ్లలో దేశీయ విక్రయాలపై (ఏడాదికి ఏడాదికి అన్ని కార్యకలాపాలపై) సగటున రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో ఐపీఏ వెల్లడించింది. ఐపీఏ విచారణకు ప్రతిస్పందనగా మైక్రోల్యాబ్స్ అన్ని కార్యకలాపాలపై ఐదు సంవత్సరాల వ్యయాల రిపోర్టును అందించింది.   ఇందులో  2020-21 ఆర్థిక సంవత్సరంలో  అమ్మకాలు,  మార్కెటింగ్‌పై మొత్తం రూ. 186 కోట్లు వెచ్చించిందని, అందులో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ టీమ్ ఖర్చులకు రూ. 65 కోట్లు, సైంటిఫిక్ అండ్‌ అకడమిక్ సేవలకు రూ. 67 కోట్లు, దాదాపు రూ. 53 కోట్లు వెచ్చించామని వివరించింది. అలాగే  2019-20లో కంపెనీ సేల్స్ అండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ కోసం రూ.67 కోట్లు వెచ్చించింది.

ఈ నివేదిక ప్రకారం, కంపెనీ గత ఐదేళ్లలో డోలో 650పై చేసిన మొత్తం ఖర్చులకు సంబంధించి, 2021లో మొత్తం  1152 లక్షలు వెచ్చించింది.  22 విజువల్ యాడ్స్‌, లిటరేచర్  అండ్‌ ప్రింట్ ప్రమోషనల్ ఇన్‌పుట్‌లు, బ్రాండ్ రిమైండర్స్‌,  ఫిజిషియన్ శాంపిల్స్, సైంటిఫిక్ అండ్‌ అకడమిక్ సర్వీసెస్ కలిపి 2020-21లో ఈ ఖర్చు రూ. 712 లక్షలుగా ఉంది.

డోలో650 సరైన మోతాదు అవునా కాదా, ధరల నియంత్రణలో ఉందా లేదా అనేదికూడా ఐపీఏ పరిశీలించింది. డోలో-650 ఎంజీ 2018లో ఇండియన్ ఫార్మకోపోయి ఆమోదించిందని తెలిపింది. ఇది జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో ఉందని స్పష్టం చేసింది.

కాగా వైద్య సంఘాల ఫిర్యాదులను స్వీకరించిన ఎన్‌పీపీఏ, యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (యుసిపిఎంపి) కింద దర్యాప్తు చేయాలని ఐపీఎను కోరింది. ఇందుకు ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ కాలంలో ఈ టాబ్లెట్లను సిఫారసు చేసేందుకుగాను వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయల లంచం ఇచ్చిందన్న ఆరోపణలు, డోలో-650 మేకర్ మైక్రో ల్యాబ్స్ జూలైలో పన్ను ఎగవేత ఆరోపణలపై టాప్ మేనేజ్‌మెంట్ కార్యాలయాలు,  నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు కూడా నిర్వహించింది.

మరిన్ని వార్తలు