domino's India: ఫ్రీగా పిజ్జాలు..జొమాటో, స్విగ్గీలకు డొమినోస్‌ గుడ్‌బై?

29 Jul, 2022 18:50 IST|Sakshi

డొమినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ జొమాటో, స్విగ్గీలకు భారీ షాకివ్వనుంది. దశల వారీగా జొమాటో,స్విగ్గీల ద్వారా పిజ్జా డెలివరీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త బిజినెస్‌ వ్యూహాన్ని అమలు చేసింది. 

డొమినోస్‌ పిజ్జా సంస్థ 'జూబిలెంట్' జులై 19న కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ను ఆశ్రయించింది. రెస్టారెంట్ భాగస్వాముల నుంచి దేశీయ ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్‌లైన స్విగ్గీ, జొమాటోలు పెద్దమొత్తంలో కమిషన్‌ వసూలు చేస్తూన్నాయంటూ సీసీఐకి ఓ రహస్య ఫైల్‌లో వెల్లడించినట్లు రాయింట్స్‌ తెలిపింది.  దీంతో సీసీఐ రెస్టారెంట్ల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న తర్వాత.. స్విగ్గీ, జొమాటోలపై చర్యలు తీసుకోనుంది.  

ఈ తరుణంలో స్విగ్గీ, జొమాటో భాగస్వామ్యం నుంచి విడిపోయేందుకు డొమినోస్‌ పిజ్జా మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన పిజ్జాల కోసం స్విగ్గీ, జొమాటోల్ని ఆశ్రయించే అవసరం లేకుండా నేరుగా డొమినోస్‌ సెంటర్‌కు వచ్చేలా మాస్టర్‌ ప్లాన్‌ వేసింది.

ఇందులో భాగంగా డొమినోస్‌ ఫ్రాంఛైజీలో కస్టమర్‌ ఆరు పిజ్జాలు కొనుగోలు చేస్తే మరో పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. డొమినోస్‌ ఆఫర్‌పై జూబిలెంట్‌ సంస్థ సీఎఫ్‌వో ఆశిష్‌ గోయాంక్‌ మాట్లాడుతూ.. మేం దీనిని ఒక ఓమ్నీచానల్ ప్రోగ్రామ్ గా చేస్తున్నాము. తద్వారా కస్టమర్ ఎంట్రీ పాయింట్‌తో సంబంధం లేకుండా ప్రయోజనాల్ని పొందవచ్చని అన్నారు.

మరిన్ని వార్తలు