Double Toll Tax Rate: వాహనదారులకు భారీ ఊరట?..ఫాస్టాగ్‌పై కోర్టులో పిటిషన్‌..అదే జరిగితే..

26 Dec, 2022 12:06 IST|Sakshi

ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాలనే నిబంధనను తప‍్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ రవీందర్‌ త్యాగి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై చీఫ్‌ జస్టీస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టీస్‌  సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా...ఈ నిబంధన వివక్షపూరితంగా, ఏకపక్షంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చీఫ్‌ జస్టీస్‌ సతీష్‌ చంద్ర శర్మ బెంచ్‌  వాదించింది. వాహనదారులు ఫాస్టాగ్‌ వినియోగించకుండా నగదు రూపంలో చెల్లించినట్లయితే..వారి వద్ద నుంచి  రెట్టింపు రేటుతో టోల్ వసూలు చేస్తున్నారనే పిటిషన్‌పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), కేంద్రం ప్రతిస్పందనను కోరింది. అధికారులు తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు..తదుపరి విచారణను ఏప్రిల్ 18న వాయిదా వేసింది.

ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారుల నుంచి డబుల్‌ టోల్‌ ఛార్జీలు వసూలు చేసేలా  మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ ఆఫ్‌ ఇండియా(ఎంఓఆర్‌టీ అండ్‌ హెచ్‌), నేషనల్‌ హైవే అథారటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)తో కూడిన  నేషనల్‌ హైవే ఫీజ్‌ అమాండ్‌మెంట్‌ రూల్స్‌ -2020 యాక్ట్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ రవీందర్ త్యాగి కోరారు.

చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్‌’

ఈ నిబంధనలు, సర్క్యులర్ వల్ల టోల్ లేన్‌లను 100 శాతం ఫాస్ట్‌ట్యాగ్ లేన్‌లుగా మారుస్తున్నాయని, దీని ఫలితంగా ఫాస్ట్‌ట్యాగ్ లేని ప్రయాణికులు టోల్ మొత్తాన్ని రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్, న్యాయవాది సైతం..టోల్ కంటే రెట్టింపు నగదు చెల్లించాల్సిన అవసరం ఉన్నందున తన కారులో ఫాస్ట్‌ట్యాగ్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు.

ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు రెట్టింపు రేటుతో టోల్ ట్యాక్స్ చెల్లించానని చెప్పారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ పర్యటనలో తాను చూసిన ప్రయాణికుల వేదనను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం), 19 (వాక్ మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ)లను ఉల్లంఘించడమేనని, డబుల్ టోల్ టాక్స్ వసూలు చేసే పద్ధతిని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై కేంద్రం సానుకూలంగా స్పందింస్తే డబుల్‌ టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేయడం లేదంటే.. ఫాస్టాగ్‌ను వినియోగించేలా మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే డబుల్‌ టోల్‌ ఛార్జీల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది.  

డబుల్‌ టోల్‌ ఛార్జీలు 
టోల్‌ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉంచే సమయాన్ని తగ్గించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14, 2021న ఫాస్టాగ్‌ విషయంలో వాహనదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ  చేసింది. నేటి అర్ధరాత్రి నుంచి వాహనదారులకు ఫాస్టాగ్‌ తప్పని సరిగా వినియోగించాలని, లేదంటే రెట్టింపు టోల్‌ పే చెల్లించాల్సిందే. వాహన దారులు తప్పని సరిగా ఫాస్టాగ్‌ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ తీసుకోవాలని సూచించింది.

చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్‌ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!

మరిన్ని వార్తలు