డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ లాభం రూ. 579 కోట్లు

29 Jul, 2020 14:02 IST|Sakshi

క్యూ1లో 13 శాతం క్షీణత

మొత్తం ఆదాయం 15 శాతం అప్‌

3 శాతం పెరిగిన డాక్టర్‌ రెడ్డీస్ షేరు

ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం దాదాపు 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 4417 కోట్లను అధిగమించింది. సమస్యాత్మక వాతావరణంలోనూ సానుకూల పనితీరు చూపగలిగినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ కోచైర్మన్‌ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. పలు విభాగాలలో పటిష్ట పనితీరు చూపినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్‌ రెడ్డీస్ షేరు ఎన్‌ఎస్ఈలో 3.5 శాతం జంప్‌చేసి రూ. 4189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో గరిష్టంగా రూ. 4209ను అధిగమించింది.

వొకార్డ్‌ బిజినెస్‌పై
దేశీ ఫార్మా కంపెనీ వొకార్డ్‌ నుంచి సొంతం చేసుకున్న ఫార్మా బిజినెస్‌ను కంపెనీలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రసాద్‌ తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం కోవిడ్‌-19 చికిత్సకు వీలుగా రెండు లైసెన్సింగ్‌ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా పలు మార్కెట్లలో కోవిడ్‌-19 చికిత్సకు వినియోగించగల ఔషధాలను అందించనున్నట్లు వివరించారు. 

>
మరిన్ని వార్తలు