డీఆర్‌డీఓ డీ-4 డ్రోన్‌ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్

2 Jul, 2021 19:53 IST|Sakshi

కొద్ది రోజుల క్రితం జమ్ము ఎయిర్‌బేస్‌పై డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, భవిష్యత్ కాలంలో డ్రోన్ల ద్వారా దాడి ఎక్కువ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ తరహా "ఐరన్ డోమ్" వ్యవస్థ రూపొందించాలని దేశంలోని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డీ-4 యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను రక్షించుకోవచ్చు. 

డీఆర్‌డీఓలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జిల్లెలమూడి మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. "డీ-4 డ్రోన్‌ వ్యవస్థ ఆదివారం జమ్మూలో జరిగిన డ్రోన్ దాడులను ఇది గుర్తించగలదు. 4 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై దాడి చేస్తుంది. అత్యంత దుర్బల ప్రదేశాలపై దాడి చేసే అవకాశం ఉన్న రోగ్ డ్రోన్లను గుర్తించి నాశనం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం. రోగ్ డ్రోన్లను నాశనం చేయడానికి ఈ వ్యవస్థలో  బహుళ సెన్సార్లు,  రెండు వేర్వేరు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు" ఆమె తెలిపారు.

డి-4 డ్రోన్ వ్యవస్థ ద్వారా శత్రు డ్రోన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ జామ్ చేయడంతో పాటు, మైక్రో డ్రోన్ల హార్డ్ వేర్ నాశనం చేయగలదని డాక్టర్ మంజుల తెలిపారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భద్రత కోసం ఈ డి-4 డ్రోన్ వ్యవస్థను ఉపయోగించారు. డి-4 డ్రోన్‌ వ్యవస్థతో ప్రమాదకర డ్రోన్ల ఉనికిని త్వరగా గుర్తించి ధ్వంసం చేయడం ద్వారా వాటి దాడుల నుంచి ప్రముఖ ప్రాంతాలను రక్షించుకోవచ్చని ఆమె వివరించారు.

చదవండి: ఆకట్టుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్

మరిన్ని వార్తలు