10 ఏళ్ల తర్వాత లాభాల్ని అర్జించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ

11 Nov, 2022 06:56 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో దాదాపు దశాబ్దం తర్వాత డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) లాభాలు ఆర్జించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో రూ. 28.61 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ.  రూ.3.98 కోట్ల నికర నష్టం ప్రకటించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 151.4 కోట్ల నుంచి రూ. 239.6 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్‌ ఫలితాలివి. 2012లో తొలిసారి రూ.కోటి వరకూ లాభాల్ని సాధించాక.. మళ్లీ 2022లో ఏకంగా రూ.28.61 కోట్లు లాభాల్ని ఆర్జించినట్లు ఎండీ, సీఈవో ఎస్‌.దివాకర్‌ వెల్లడించారు.

ఇటీవల ఇంధన ధరలు అధికమైనప్పటికీ.. మెరుగైన పనితీరుని ప్రదర్శించినట్లు దివాకర్‌ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.1000 కోట్ల టర్నోవర్‌ సాధించే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు తెలియజేశారు.  ఫలితాల నేపథ్యంలో డ్రెడ్జింగ్‌ కార్ప్‌ షేరు 0.6 శాతం నీరసించి రూ. 357 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు