అలవాటు లేకున్నా.. మొండిగా ముందుకుపోతున్న దుబాయ్‌, అగ్రరాజ్యంకు సాధ్యంకానిదీ ఫీట్‌!

10 Jan, 2022 13:44 IST|Sakshi

Dubai Sucessfully Deployed AI Tech In Govt Sectors: ఆయిల్‌ కంట్రీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కీలక నగరం దుబాయ్‌.. గత ఏడాది కాలంగా అరుదైన ప్రయోగాలతో ప్రపంచాన్ని అచ్చెరువుకు గురి చేస్తోంది. ఆవిష్కరణల భాండాగారంగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. విప్లవాత్మక సంస్కరణలతో దూసుకుపోతున్న దుబాయ్‌.. ఇప్పుడు సాహసోపేతమైన అడుగులకు సైతం వెనకాడడం లేదు. 


అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఇప్పుడు ఈ టెక్నాలజీ అవసరం దాదాపు అన్ని రంగాల్లో అవసరం పడుతోంది. మనకు తెలియకుండానే వాడేస్తున్నాం కూడా!.  ప్రైవేట్‌ రంగాల్లో దాదాపు ఏఐ సహకారం లేకుండా ముందుకు సాగడం లేదు.  అయితే ప్రభుత్వ రంగాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏఐని ఉపయోగించుకునేందుకు తటపటాయిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం.. భద్రత. ఈ తరుణంలో దుబాయ్‌ సర్కార్‌ ఏమాత్రం బెణుకు ప్రదర్శించకుండా ముందుకు సాగుతోంది.

 

ప్రమాదం లేకపోలేదు
AI టెక్నాలజీ వాడకం ఇప్పుడు ఎంత ఉధృతంగా నడుస్తోందో.. సమీప-కాలంలో అంతే ఆందోళనను రేకెత్తిస్తోంది.  గోప్యత, పారదర్శకత, అసమానత, భద్రత.. ఈ అంశాలు పెను సవాల్‌గా మారాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో పుట్టుకొస్తున్న బెదిరింపులు, ఇతర పోకడలను సైతం గుర్తించింది CSER పరిశోధన. అంతేకాదు AI, డిజిటలైజేషన్, న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్‌ల తరపున ఎదురయ్యే ముప్పును సైతం ప్రస్తావించింది. ప్రధానమైన అంశాలు కావడం వల్లే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం ఏఐను రక్షణ రంగంలో అన్వయింపజేసేందుకు ముందు వెనకా ఆలోచిస్తుంటుంది. అయితే.. 

ఎలా అధిగమిస్తోందంటే..
వనరులను, మేధస్సును వాడుకోవడంలో దుబాయ్‌ నిజంగానే అద్భుతాలు చేస్తోంది. అసలే టెక్నాలజీ కొత్తైన ఈ సిటీ.. అవసరం మేర మాత్రమే ఏఐను ఉపయోగించుకోవడంపై ఫోకస్‌ చేసింది. ఆరోగ్యభద్రత, విద్య, రవాణా, ప్రజా భద్రత విషయంలో ఏఐ సంబంధిత టెక్నాలజీనే ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టింది. ప్రజల దైనందిన జీవితంలోకి జొప్పించి.. అలవాటు చేయిస్తోంది. స్మార్ట్‌దుబాయ్‌ ఆఫీస్‌ల సహకారంతో ఎన్నో వ్యూహాల నడుమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏఐ, బ్లాక్‌కెయిన్‌ ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించడమే కాకుండా.. జనాల ఫీడ్‌బ్యాక్‌ను సైతం తీసుకుంటోంది. తద్వారా ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. వీటికి తోడు ఎథికల్‌ టూల్‌ కిట్స్‌ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. హైలెవల్‌ సర్వీసులు కావడంతో ఏఐ అల్గారిథమ్‌ పొరపచ్చాలతో తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు.  ఇందుకోసం భారీగా ఇంజినీర్లను నియమించుకుంటోంది కూడా. 


2030 నాటికి ఏఐ సంబంధిత వ్యవస్థ కోసం 320 బిలియన్‌ డాలర్ల  ఖర్చు పెట్టే యోచనలో  ఉన్నాయి మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు. ఈ అవకాశం అందిపుచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది దుబాయ్‌ మహానగరం. 


దుబాయ్‌ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. కానీ, ఆనందం అంటే కేవలం ఎక్కువ డబ్బును కలిగి ఉండడం కాదు. గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో కమ్యూనిటీతో ఎలా పొత్తు పెట్టుకోవాలి? సామాజిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలా పని చేయాలి? అనే విషయాలపైనే దుబాయ్‌ ఫోకస్‌ పెట్టింది. అలా దుబాయ్.. ఈ  భూమిపై అత్యంత సంతోషకరమైన నగరంగా స్థానం సంపాదించుకునే మార్గం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక మేధావులు ఒక అంచనాకి వేస్తున్నారు.

క్లిక్‌ చేయండి: ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్‌

మరిన్ని వార్తలు