తక్కువ ధరకే ఎలక్ట్రిక్ సైకిల్: సింగిల్ ఛార్జ్‌తో..

1 Apr, 2023 18:49 IST|Sakshi

భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణంగానే వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, CNG వాహనాలు దేశీయ విఫణిలో విడుదలవుతున్నాయి.

ప్రస్తుతం బస్సులు, కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదలవుతున్నాయి. ఇటీవల రాజస్థాన్‌ ఉదయపూర్ నగరంలోని మహారాణా ప్రతాప్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 45 కిమీ రేంజ్ అందిస్తుంది.

సుమారు 160 కేజీల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ నిత్యజీవితంలో రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 30 నిముషాల్లో ఛార్జ్ చేసుకోగలదు. ఈ విషయాన్ని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ విక్రమాదిత్య దవే వెల్లడించారు.

(ఇదీ చదవండి: 1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!)

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గేర్, పెడల్ సిస్టమ్ రెండింటినీ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ప్యానెల్ ప్లేట్, లైట్, హార్న్ వంటివి కూడా అమర్చారు. పాత సైకిల్‌ని ఇలాంటి కొత్త సైకిల్ మాదిరిగా మార్చడానికి రూ. 18,000, కొత్త సైకిల్ కావాలంటే రూ. 30,000 నుంచి రూ. 35,000 ఖర్చవుతుందని డాక్టర్‌ విక్రమాదిత్య తెలిపారు. ఈ సైకిల్ కావాలనుకునే వారు కాలేజీని సంప్రదించి తీసుకోవచ్చని కూడా వెల్లడించారు.

మరిన్ని వార్తలు