గుడ్‌న్యూస్‌: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ ధరలు!

26 Jan, 2022 20:35 IST|Sakshi

కొవిడ్‌ వ్యాక్సిన్‌లు త్వరలో రెగ్యులర్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నాయన్న విషయం తెలిసిందే. డ్రగ్‌ నియంత్రణ విభాగం నుంచి అప్రూవల్‌ దక్కిన వెంటనే టీకాలు మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయనున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో ఇప్పుడు మరో గుడ్‌ న్యూస్‌ అందింది. 

రెగ్యులర్‌ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్‌ వ్యాక్సిన్‌ల ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్‌ల ధరలు ఒక్కో డోసు రూ. 275గా నిర్ధారణ కానున్నాయని, అదనంగా సర్వీస్‌ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తం.. రూ. 425గా ఉండొచ్చని ఆ కథనాలు వెల్లడించాయి.

 

ఈ మేరకు నేషనల్‌ ఫార్మాసుటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ (NPPA) ధరల నియంత్రణ.. తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 19న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ‘కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ’ కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్‌లకు సాధారణ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే పనిలో పనిగా ధరల నిర్ధారణపై కూడా ఎన్‌పీపీఏను కోరినట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌  సెంటర్లలో  కోవాగ్జిన్‌ ధర ఒక డోస్‌కు 1,200రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్‌ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్‌లు.  ఒకవేళ వ్యాక్సిన్ కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు.

భారత్‌లో వ్యాక్సినేషన్‌ ఉధృతిగా సాగుతున్న టైంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ కంపెనీలు రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

మరిన్ని వార్తలు