క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌ వాజిర్‌ఎక్స్‌కు ఈడీ నోటీసులు

12 Jun, 2021 16:36 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌ ఏజెన్సీ వాజిర్‌ఎక్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌(ఫెమా) ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సుమారు 2,790 కోట్ల రూపాయల ట్రాన్‌జాక్షన్స్‌పై ఉల్లంఘనలకు పాల్పడిందని వాజిర్‌ఎక్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. 

వాజిర్‌ఎక్స్‌ కంపెనీ జెన్మయి ల్యాబ్స్‌ ప్రైవేట్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ పేరు మీద రిజిస్ట్రర్‌ అయ్యి ఉంది. డొమెస్టిక్‌ క్రిప్టోకరెన్సీ స్టార్టప్‌గా 2017లో దీనికి అనుమతులు లభించాయి. దీంతో ఈ కంపెనీ డైరెక్టర్ల పేరు మీదే ఈడీ నోటీసులు పంపింది. చైనాకు చెందిన ఇల్లీగల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్లికేషన్ల మీద అన్ని కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ట్రాన్‌జాక్షన్స్‌ జరిగినట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు చైనా నుంచి 57 కోట్ల రూపాయల విలువైన డబ్బు మన కరెన్సీలోకి మార్చేశారని,  ఆతర్వాత బినాన్స్‌ వాలెట్లలోకి పంపించారని తేలింది. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై విచారణ జరపనుంది.

అంతేకాదు వజీర్‌ఎక్స్‌ సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించకుండానే.. లావాదేవీలు జరిపిందని, ఫెమా మార్గదర్శకాల్ని ఉల్లంఘించిందని ఈడీ పేర్కొంది. అభివృద్ధిలో భాగంగా క్రిప్టోకరెన్సీని ప్రొత్సహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ ఇలాంటి స్కామ్‌లు వెలుగుచూడడం మంచిది కాదని టెక్‌ నిపుణులు అంటున్నారు. అయితే ఈడీ నుంచి ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని వాజిర్‌ఎక్స్‌ సీఈవో నిశ్చల్‌శెట్టి ఒక ట్వీట్‌ చేశాడు.

చదవండి: పోర్న్‌ క్రిప్టోకరెన్సీ తెలుసా?

మరిన్ని వార్తలు