ED Summons To Poonam Jain: ఢిల్లీ మంత్రి భార్యకు ఈడీ సమన్లు

8 Jul, 2022 19:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ భార్య పూనమ్ జైన్‌కి ఈడీ సమన్లు ​​జారీ చేసింది. జులై 14న  విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కోల్‌కతాకు చెందిన కంపెనీల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి సత్యేంద్ర జైన్‌ అరెస్టు (మే 30) తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. 

జైన్  భార్య, తదితరులపై నమోదైన అక్రమ ఆస్తులు, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో  రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2017, ఆగస్టు 25న, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ  సత్యేందర్ జైన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది.

జైన్ ఢిల్లీలో పలు షెల్ కంపెనీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2010 నుండి 2014 వరకు కోల్‌కతాకు చెందిన ముగ్గురు హవాలా ఆపరేటర్లకు చెందిన 54 షెల్ కంపెనీల ద్వారా 16.39 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి అయిన తరువాత ప్రయాస్, ఇండో, అకించన్ కంపెనీల  వాటాలను 2015లో భార్య పూనమ్‌కు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. మరోవైపు జైన్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక సీబీఐ కోర్టు  జూలై 11 వరకు పొడిగించింది.

మరిన్ని వార్తలు