మౌలిక రంగం పరుగు

1 Oct, 2021 03:56 IST|Sakshi

ఆగస్టులో ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌ వృద్ధి రేటు 11.6 శాతం

లో బేస్‌తో పాటు కొన్ని కీలక రంగాల పురోగతి కారణం

క్రూడ్‌ ఆయిల్, ఎరువుల పరిశ్రమలు మైనస్‌లోనే...

న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌ ఆగస్టులో మంచి పురోగతిని కనబరిచింది.  ఈ రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా నమోదయ్యింది. క్రూడ్‌ ఆయిల్, ఎరువుల విభాగాలుమినహా కీలక రంగాల పురోగతితోపాటు లో బేస్‌ ఎఫెక్ట్‌ కూడా దీనికి కారణం.  ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. 

ఇక్కడ బేస్‌ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో  అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లో బేస్‌తో పోలి్చతే తాజా సమీక్షా నెల్లో ఎనిమిది రంగాల ఉత్పత్తి 11.6 శాతం పెరిగిందన్నమాట.  మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) ఈ గ్రూప్‌ వెయిటేజ్‌ దాదాపు 40.27 శాతం.   గురువారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన గణాంకాలను పరిశీలిస్తే...

► బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది.  
► సిమెంట్‌ రంగం 36.3% పురోగమించగా, స్టీల్‌ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది.
► పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1% పెరిగింది.  
► విద్యుత్‌ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది.  
► క్రూడ్‌ ఆయిల్‌ (మైనస్‌ 2.3 శాతం), ఎరువుల (మైనస్‌ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి.

ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్‌ వృద్ధి లేకపోగా 17.3 శాతం క్షీనత నమోదయ్యింది.

మరిన్ని వార్తలు