భవిష్యత్‌లో కరెన్సీ మాయం..పెత్తనం అంతా బిట్‌ కాయిన్లదే!

25 Dec, 2021 10:57 IST|Sakshi

భవిష్యత్‌ అంతా బిట్‌ కాయిన్లదే. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే కనుమరుగవుతుంది. క్రిప్టో వినియోగం పెరుగుతుంది. సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది అంటూ ఓ దేశాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

వరల్డ్‌ వైడ్‌గా బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌లకు చట్టబద్ధత (అధికారిక కరెన్సీ) కల్పించిన ఎల్‌ శాల్వడార్‌ అధ్యక్షుడు నయిబ్‌ బుకెలె..ఆ కరెన్సీపై మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగించే కరెన్సీ త్వరలో కనుమరుగవుతుంది. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న 'రియల్‌ రివల్యూషన్‌' బిట్‌కాయిన్ అని బుకెలె ట్వీట్‌ చేశారు. పైగా బిట్‌కాయిన్ యుగానికి ఎల్ సాల్వడార్ నాయకత్వం వహిస్తోందని జోస్యం చెప్పారు.

ప్రపంచం మొత్తం ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు క్రిప్టోకరెన్సీని వినియోగించాలని చూస్తోంది. అయితే బిట్‌కాయిన్‌ల వినియోగం  దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రిప్టోతో ఆర్ధిక వ్యవస్థకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటే భవిష్యత్‌లో వాడుకలో ఉన్న కరెన్సీ వినియోగం ఆగిపోతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు వినియోగంలో ఉన్న కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీని ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. దీని కోసం చేయాల్సిందల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ మెరుగైందని నిరూపించుకోవడమేనని అన్నారు. 

$400 మిలియన్ డాలర్ల భారం తగ్గించాలనే 
బిట్‌ కాయిన్‌ వినియోగంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నా..ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు మాత్రం..ఆ దేశ ఆర్ధిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఇతర దేశాల నుంచి ఆదేశానికి మధ్య జరిగే ఆర్ధిక లావాదేవీలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సుమారు 400 మిలియన్ల డాలర్ల అధిక రుసుముల్ని తగ్గించే మార్గాల్ని అన్వేషించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెప్టెంబరులో బిట్‌కాయిన్‌ను చట్టబద్ధం చేసినప్పుడు ఎల్ సాల్వడార్ ప్రభుత్వం తరుపున మొత్తం 400 బిట్‌కాయిన్‌లు, అంతకంటే ఎక్కువగానే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కాయిన్‌ల సంఖ్య 1000కి చేరింది. ఆ బిట్‌ కాయిన్‌ల సేకరణ మరింత పెంచేందుకు ఏటీఏం తరహాలో దేశ వ్యాప్తంగా 200 బిట్‌ కాయిన్‌ టెల్లర్ మెషీన్‌లను ఇన్‌స్టాల్‌ చేసింది. ఆ మెషిన్‌ల ద్వారా  బిట్‌ కాయిన్‌లను కొనుగోలు చేసే పౌరులకు ప్రత్యేకంగా రాయితీలు అందించేలా చర్యలు తీసుకున్నారు. 

బుకెలెకు వార్నింగ్‌   
బిట్‌కాయిన్‌ బాండ్లతో బిట్‌ కాయిన్‌సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు కొద్ది నెలల క్రితం నయిబ్‌ బుకెలె ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) షాకిచ్చింది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బిట్‌ కాయిన్‌ల వల్ల వినియోగదారుల రక్షణ, ఆర్థిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వానికి గణనీయమైన నష్టాల్ని కలిగిస్తుందని ఐఎంఎఫ్‌ తెలిపింది. అయితే బుకెలే మాత్రం ఐఎంఎఫ్‌ హెచ్చరికల్ని లైట్‌ తీసుకుంటున్నారు. బిట్ కాయిన్‌లతో లాభాల్ని గడిస్తున్నారు. 

లాభాలు 
ఎల్‌ సాల్వడార్‌ దేశాధ్యక్షుని తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నా..బిట్‌ కాయిన్‌లపై ఆర్ధిక కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. ఎల్ సాల్వడార్ దేశం బిట్‌కాయిన్‌లపై ఆర్ధిక లావాదేవీల్ని నిర్వహిస్తుంది. క్రిప్టో కాయిన్‌ కొనుగోలు చేసే సమయంలో  దాని ధర తక్కువగా ఉండడం, ఆ తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో భారీ లాభాల్ని చవిచూస్తుంది. కానీ దేశ ఆర్ధిక ప్రయోజనాల కోసం బిట్‌ కాయిన్‌లపై ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడం ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది.లేదంటే కోలుకోలేని   నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని పలువురు ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్‌కాయిన్‌ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..!

మరిన్ని వార్తలు