టపా టప్‌: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌! కారణం అదేనా!

18 Apr, 2022 12:14 IST|Sakshi

దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌,డీజిల్‌ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ను కొనేకంటే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కావాలని ఎగబడుతున్నారు. కానీ వరుస ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ప్రమాదాలు వాహనదారుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, మహరాష్ట్ర, పూణేలలో ఈవీబైక్‌లు దగ్ధమవ్వగా..ఇవ్వాళ వరంగల్‌లో మరో ఎలక్ట్రిక్‌ బైక్‌ అగ్నికి ఆహుతైంది.   

వరంగల్‌లో ఎలక్ట్రిక్‌ బైక్‌ దగ్ధమైంది. ఉదయం 6గంటలకు వరంగల్ చౌరస్తాలోని అప్నా పాన్ షాప్ సెంటర్‌ వద్ద ఈ ఘటన చోటు చేసింది. పార్కు చేసిన ఎలక్ట్రికల్ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్‌ బైక్‌ పూర్తిగా కాలిపోయింది.

మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్‌లో 
మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్‌ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్‌  ఛార్జింగ్‌. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్‌ పాయింట్స్‌. లిడ్‌ యాసిడ్‌లతో పోల‍్చితే..లిథియం ఆయాన్‌ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. 

లిథియం అయాన్‌ బ్యాటరీల్లో ఎలక్ట్రోలేడ్‌ ద్రావణం
రోజుల వ్యవధిలో వరుసగా ఎలక్ట్రిక్‌ బైక్‌లు తగలబడిపోవడం..ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకంపై భయాల్ని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ వాహనదారులు ఈ లిథియం అయాన్‌ బ్యాటరీలను వాడాలంటే జంకుతున్నారు. ఎందుకంటే సరైన పద్దతిలో వినియోగించుకోకపోతే లిథియం అయాన్‌ బ్యాటరీలో పేలే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లిథియం అయాన్‌ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్‌ టెర్మినళ్లు ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్‌ టెర్మినళ్ల వద్ద ఎలక్ట్రోలేడ్‌ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ఎలక్ట్రిక్‌ బైక్‌లు ప్రమాదానికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టినప్పుడు దీనిలో ఉన్న ఆయాన్‌లు ఒక ఎలక్ట్రోడ్‌ నుంచి మరో ఎలక్ట్రోడ్‌కు ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో ఎలక్ట్రిక్‌ ద్రావణం అగ్ని ప్రమాదం జరిగేలా ప్రేరేపిస్తుంది. కాబట్టే ఎలక్ట్రోడ్‌లు ఉండే బ్యాటరీలను విమానాల్లోకి అనుమతించరు.

ఏథర్‌ ఏం చెబుతుందంటే 
ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్‌ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సంస్థ ఏథర్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాటరీ మేనేజ్మెంట్‌ సిస్టం లిథియం అయాన్‌ బ్యాటరీకి వర్తిస్తుంది. అంటే బ్యాటరీ ఛార్జింగ్‌ డిస్‌చార్జింగ్‌ రేటు. సామర్థ్యం, లైఫ్‌ సైకిల్‌, ఛార్జింగ్‌ అయ్యే సమయంలో ఏ స్థాయిలో వేడెక్కుతుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ను వినియోగించుకోవచ్చని, అప్పుడే పేలుడు ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని ఎథర్‌ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది. 

చదవండి: ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే షేపులు ఇలా మారిపోయాయేంటీ?

మరిన్ని వార్తలు