Electric Car: దేశంలో జోరందుకున్న ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు

7 Nov, 2021 15:05 IST|Sakshi

Electric Cars Breaks Sales Records in India: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహన ధరలు తగ్గడం వల్లే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో(ఏప్రిల్ 2021 - సెప్టెంబర్ 2021) మొత్తం 6,261 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఈవీ కార్ల అమ్మకాల్లో ఇది ఒక కొత్త రికార్డు. గత ఏడాది ఇదే కాలంలో(ఏప్రిల్ 2020 - సెప్టెంబర్ 2020) 1,872 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 234 శాతం అమ్మకాలు పెరిగాయి.

నెంబర్ వన్ టాటా నెక్సన్ ఈవీ
ఈ అమ్మకాల్లో ఎక్కువగా టాటా నెక్సన్ ఈవీ కార్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 3,618 యూనిట్లు విక్రయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 214 శాతం అధికం. మొత్తం అమ్మకాల్లో అమ్మకాల పరంగా ఏంజీ జెడ్ఎస్ ఈవీ రెండో స్థానాన్ని పొందింది. హెచ్1 ఎఫ్ వై21-22లో 1,789 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 250 శాతం అధికం.  801 యూనిట్ల అమ్మకాలతో టాటా టిగోర్ ఈవీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ కారు 701 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ కోనా అమ్మకాల పరంగా నాల్గవ స్థానాన్ని కలిగి ఉంది.
 

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 51 యూనిట్లు విక్రయించింది. కానీ, గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. ఆ తర్వాత స్థానంలో మహీంద్రా వెరిటో ఉంది. ఈ ఆరు నెలల కాలంలో మహీంద్రా 2 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 75 శాతం అమ్మకాల క్షీణతను నమోదు చేసింది. సమీప భవిష్యత్తులో భారత మార్కెట్లో మరిన్ని ఈవీలు విడుదల కానున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో ఈకెయువీ100ని లాంచ్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టాటా మోటార్స్ కూడా త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. ఈ వరుసలో ఆల్ట్రోజ్ ఈవీ, పంచ్ ఈవీ ఉన్నాయి. ఏంజీ మోటార్ ఇండియా కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు గతంలో ప్రకటించింది. హ్యుందాయ్, కియా కూడా కొన్ని ఈవీలను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. 

(చదవండి: జియో ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం, ఎలా కొనాలో తెలుసా..?)

మరిన్ని వార్తలు