Electric Vehicle Charging In Hyderabad: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్ ధర ఇంత తక్కువ..?

12 Dec, 2021 17:27 IST|Sakshi

హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరగడంతో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఈవీలను ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జింగ్ చేసుకుంటే ఎంత ధర చెల్లించాలో కూడా పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త ధరలు వచ్చే ఏప్రిల్ నెల నుంచి వర్తించనున్నాయి. 

అలాగే, ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం అందించనుందని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎస్‌ రెడ్‌కో) పేర్కొంది. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్‌ వీలర్‌ తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ సబ్సిడీ ఉంటుందన్నారు. ఫేమ్ 2 స్కీమ్ కింద హైదరాబాద్ అంతటా సుమారు 118పబ్లిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. 

హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ పట్టణాలలో మరో 20 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ మొత్తం 138కి చేరుకోనుంది. ఇప్పటికే, నగరంలో కొన్ని ప్రదేశాలలో ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ వచ్చే మార్చి నాటికి సిద్ధం కానున్నాయి. టీఎస్‌ రెడ్‌కో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జనయ్య మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఇది పెట్రోల్ & డీజిల్ కంటే చాలా చౌక అని పేర్కొన్నారు. "ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటాకు చెందిన 30.2 కిడబ్ల్యుహెచ్‌ బ్యాటరీ గల టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కారును ఫుల్ చార్జ్ చేయడానికి రూ.360 అయితే, అదే పెట్రోల్, డీజిల్ కార్ల కోసం అయితే 3 లీటర్ల పెట్రోల్ కూడా రాదని" అని ఆయన అన్నారు. అదే ఇంటి వద్ద ఎలక్ట్రిక్ వాహనలను ఛార్జింగ్ చేసుకుంటే కిడబ్ల్యుహెచ్‌కు కేవలం రూ.6 మాత్రమే అవుతుంది అని అన్నారు. 

(చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!)

మరిన్ని వార్తలు