ఎలాన్‌ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్‌!

18 Nov, 2022 09:04 IST|Sakshi

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖర్చుని తగ్గించడం కోసం మస్క్‌ ట్విటర్‌ సిబ్బందిని తగ్గిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వందలాది మంది ఉద్యోగులు తమకీ పని వద్దురా బాబో అంటూ రాజీనామా చేసినట్లు సీఎన్‌బీసీ తన నివేదికలో తెలిపింది.

ట్విటర్‌లో ఏం జరుగుతోంది..
ట్విటర్‌కు సీఈఓ బాధ్యతలు చేపట్టిన ఎలాన్‌ మస్క్‌ సంస్థలో భారీ మార్పులకు పూనుకున్నాడు. పైగా ఇటీవల ఉద్యోగులతో జరిపిన సమావేశంలో మస్క్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది.

 ఫ్రీ ఫుడ్‌ తొలగింపు, ఉద్యోగుల పనితీరును బట్టి సంస్థలు అందించే ప్రోత్సాహకాల తగ్గింపు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను రద్దు చేస్తున్నట్లు తెగేసి చెప్పారు. సంస్థ దివాలా తీసే పరి​స్థితిలో ఉందంటూ సిబ్బందిలో మార్పు రాకపోతే తొలగింపులు తప్పవని స్పష్టం చేశారు. 

నివేదికల ప్రకారం..
ట్విటర్‌ బాస్‌ జారీ చేసిన అల్టిమేటంకు సంస్థలోని ఇంజనీర్‌లతో సహా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాజీనామ చేశారు. అయితే అనుహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ట్విట్టర్ సోమవారం వరకు ఆ ప్రాంతంలోని తన కార్యాలయాలను మూసివేసింది.

మరో వైపు, సామూహిక రాజీనామాలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ముగ్గురు ట్విటర్ ఉద్యోగులు తాము కంపెనీకి వీడ్కోలు పలుకుతున్నట్లు పంచుకున్నారు.

చదవండి: త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్‌ సంచలన ప్రకటన

మరిన్ని వార్తలు