ఎలాన్‌ మస్క్‌ మరో సంచలనం!

12 Aug, 2022 11:52 IST|Sakshi

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరహాలో తానే సొంతంగా ఓ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఆ ఫ్లాట్‌ ఫామ్‌ పేరు కూడా రివిల్‌ చేశారు.  

గతేడాది అమెరికా అధ్యక్ష పీఠాన్ని వీడిన డొనాల్డ్‌ ట్రంప్‌ చివరి రోజుల్లో విపరీత చర్యలకు పాల్పడ్డారు. బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు ఉన్న అన్నీ దార్లను వినియోగించుకొని భంగ పాటుకు గురయ్యారు. తన అనుచరులతో కలిసి అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడ్డారు. దేశ ప్రజలు, సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అయితే ఆ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడిగా సేవలందించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్‌ చేశాయి. దీంతో ట్రంప్‌ సొంతంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌ను లాంచ్‌ చేశారు. 

ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరహాలో ఎలాన్‌ మస్క్‌ సొంతంగా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. @టెస్లా ఓనర్‌ ఎస్‌వీ అనే ట్విట్టర్‌ యూజర్‌..'ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందం రద‍్దయితే  మీరు సొంత సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభిస్తారా? అని ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు ఎలాన్‌ మస్క్‌ రిప్లై ఇచ్చారు. ఎక్స్‌.కామ్‌ తన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ అంటూ రివీల్‌ చేశారు. 

వాస్తవానికి ఎలాన్‌ మస్క్‌ ఈ తరహా ట్వీట్‌ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది మార్చిలో ఓ నెటిజన్‌ మీరు ఓపెన్ అల్గారిథమ్‌తో సోషల్ మీడియా సైట్‌ని క్రియేట్‌ చేస్తారా అని ప్రశ్నించగా.. ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తా' అని మస్క్‌ స్పందించారు. ఈ ట్వీట్‌ చేసిన కొన్ని రోజులకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.

మళ్లీ ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ తానే సొంతంగా సోషల్‌ మీడియా సైట్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. కాగా, ఎలాన్‌ మస్క్‌ చెప్పిన ఎక్స్‌.కామ్‌లో గతంలో ఆర్ధిక కార్యకలాపాలు జరిగేవి. ఇప్పుడు ఆ సైట్‌లో ఎలాంటి కంటెంట్‌ లేకపోవడంతో ఎలాన్‌ మస్క్‌ చెప్పింది నిజమేనంటూ ఆయన అభిమానులు భావిస్తున్నారు.

చదవండి👉 ‘ఎవరొస్తారో రండి‘.. తేల్చుకుందాం, పరాగ్‌ అగర్వాల్‌కు ఎలాన్‌ మస్క్‌ సవాల్‌! 

మరిన్ని వార్తలు