Elon Musk ట్విటర్‌ డీల్‌: మస్క్‌ మరోసారి సంచలన నిర్ణయం!

26 Oct, 2022 11:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌  కొనుగోలుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి కీలక ప్రకటన చేశారు.  44 బిలియన్ల  డాలర్ల ట్విటర్‌ డీల్‌ను అతి త్వరలోనే  పూర్తి చేయనున్నారట. ట్విటర్‌ కొనుగోలుకు  సంబంధిత నిధులు సమకూర్చుకుంటున్న మస్క్‌ శుక్రవారం నాటికి  కొనుగోలును  పూర్తి చేయాలని భావిస్తున్నారట.

ఈ మేరకు సహ-పెట్టుబడిదారులకు మస్క్‌ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీల్‌కు నిధులు సమకూర్చే బ్యాంకర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాల్‌లో ట్విటర్‌ కొనుగోలు డీల్‌ను  త్వరలోనే ముగించాలని మస్క్‌ నిర్ణయించినట్టు వార్త లొచ్చాయి.  ముఖ్యంఆ సీక్వోయా క్యాపిటల్, బినాన్స్, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ , ఇతరులతో సహా ఈక్విటీ పెట్టుబడిదారులు మస్క్ లాయర్ల నుండి ఫైనాన్సింగ్ కమిట్‌మెంట్‌కు సంబంధించిన  పత్రాలను అందుకున్నారని  విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

డెలావేర్ కోర్టు న్యాయమూర్తి గడువు నేపథ్యంలో శుక్రవారం నాటికి లావాదేవీని పూర్తి చేసేలా మస్క్ ప్లాన్ చేస్తున్నాడని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కొనుగోలు నిధులు సమకూర్చిన బ్యాంకులు తుది రుణ ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని బ్లూమ్‌బెర్గ్  నివేదించింది. అయితే తాజా పరిణామంపై, మస్క్‌ లాయర్లుగానీ, ట్విటర్  గానీ అధికారింగా  ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
 

మరిన్ని వార్తలు