అమ్మకానికి ట్విటర్‌ ఆఫీస్‌ వస్తువులు.. ఎలాన్‌ మస్క్‌ మరీ దిగజారిపోతున్నారా?

12 Dec, 2022 18:36 IST|Sakshi

గత యాజమాన్యం ట్విటర్‌లో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి భోజనం ఖర్చు రూ.32వేలు కాగా.. ఏడాదికి 13 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోందని ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మస్క్‌ ట్విటర్‌ బాస్‌గా తన మార్క్‌ చూపించుకునేందుకు తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టే ట్విటర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఉన్న ప్రతి వస్తువును వేలానికి పెట్టారు. ఆ వేలం జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది.  

శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలోని 265 కిచెన్‌ అప్లయెన్సెస్‌, ఆఫీస్‌ ఫర్నీచర్‌ను ఆక్షన్‌కు.. వాటిల్లో సింక్‌ లేకపోవడం గమనార్హం. ఇక ఈ వేలంలో ఒక్కో వస్తువు ప్రారంభం ధర 25డాలర్లుగా నిర్దేశించినట్లు వేలం నిర్వహించే శాన్‌డియోగో కేంద్రంగా ఉన్న హెరిటేజ్‌ గ్లోబల్‌ పార్ట్‌నర్‌ వెల్లడించింది. 

వేలంలో ఉన్న వస్తువులు ఇవే
మస్క్‌ వేలానికి ఉంచిన ట్విటర్‌ ఆఫీస్‌కు చెందిన వస్తువుల్లో ఆఫీస్‌ చైర్‌లు, ఎస్ప్రెస్సో మెషీన్లు, కాఫీ గ్రైండర్లు, స్టీమ్ టిల్టింగ్ కెటిల్స్, పిజ్జా తయారు చేసుకునే వస్తువులు, ఎలక్ట్రిక్/బేకరీ ఓవెన్‌లు, ఫ్రీజర్‌లు (బార్ రిఫ్రిజిరేటర్‌తో సహా), మొబైల్ హీటెడ్ క్యాబినెట్‌లు, ఐస్ మేకింగ్ మెషీన్‌లు, ఫ్రయ్యర్లు, లేజర్ ప్రొజెక్టర్‌లు ఉన్నాయి. 

రోజుకు రూ.32 కోట్ల నష్టం
వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ (డబ్ల్యూఎస్‌జే) కథనం ప్రకారం.. ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ ఆదాయం భారీగా పడిపోయింది. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేయడం..ప్రపంచ దేశాలకు దిగ్గజం కంపెనీలు ట్విటర్‌లో ఇచ్చే ప్రకటనల్ని నిలిపివేశాయి. దీంతో ట్విటర్‌ రోజు 4 మిలియన్‌ (రూ.32 కోట్లు) డాలర్ల నష్టం వాటిల్లినట్లు డబ్ల్యూఎస్‌జే తెలిపింది. 
 
అప్పుల ఊబి నుంచి బయటపడేందుకేనా 
అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు మస్క్‌ ట్విటర్‌ బ్లూ లాంటి పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో మాదిరిగా ఫ్రీగా కాకుండా.. ట్విటర్‌ సంస్థకు చెందిన క్యాంటిన్‌లో నచ్చిన ఫుడ్‌ తినాలంటే 8 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. ఇప్పుడు ఆఫీస్‌లో వినియోగించుకునే వస్తువుల్ని అమ్మకానికి పెట్టడంతో మస్క్‌ మరింత దిగజారుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.అయితే ఈవేలానికి ట్విటర్‌ ఆర్ధిక పరిస్థితులకు సంబంధం లేదని వేలం పనులు చూస్తున్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్‌కు చెందిన నిక్ డోవ్ తెలిపారు.

మరిన్ని వార్తలు