ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్..!

21 Mar, 2022 20:32 IST|Sakshi

ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిపై ప్రతిపాదిత 8.1 శాతం వడ్డీ రేటు ఇతర చిన్న పొదుపు పథకాలు అందించే వడ్డీ రేట్ల కంటే మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత కాలపు వాస్తవికతలను బట్టి, త్వరలో వడ్డీ రేటును సవరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ రేటును 8.1 శాతానికి తగ్గించాలని బోర్డు ప్రతిపాదించిందని ఆమె రాజ్యసభలో అప్రాప్రియేషన్ బిల్లులపై చర్చకు సమాధానంగా చెప్పారు. 

"ఈపీఎఫ్ఓకు ఒక సెంట్రల్ బోర్డు ఉంది, చందాదారులకు ఎంత రేటు ఇవ్వాలనే దానిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. వారు కొంతకాలంగా వడ్డీ రేటును మార్చలేదు.. ఇప్పుడు దానిని 8.1 శాతానికి మార్చారు" అని ఆమె పేర్కొన్నారు. ఇది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు తీసుకున్న నిర్ణయం.. బోర్డులో విస్తృత శ్రేణి ప్రతినిధులు ఉన్నారు. సుకన్య సమృద్ధి యోజన(7.6 శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (7.4 శాతం), పీపీఎఫ్ (7.1 శాతం) వంటి ఇతర పథకాలు అందించే రేట్లు చాలా తక్కువగా ఉండగా, ఈ వడ్డీ రేటును 8.1 శాతంగా ఉంచాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. "వాస్తవంగా ఈ రోజు అమలులో ఉన్న ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు మిగిలిన వాటి కంటే ఇంకా ఎక్కువగా ఉంది" అని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ సవరణ ఇప్పుడు "నేటి వాస్తవాలను" ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2020-21లో ఉన్న 8.5 శాతం నుంచి 2021-22 నాటికి 8.1 శాతానికి తగ్గించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. 

(చదవండి: టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్‌కు సిద్ధమైన యూరప్‌ కంపెనీ..!)

మరిన్ని వార్తలు