ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త

11 Oct, 2021 19:30 IST|Sakshi

న్యూఢిల్లీ: 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ త్వరలో శుభవార్త చెప్పనుంది. తన ఖాతాదారులకు వడ్డీ జమ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ఓ 6 కోట్ల మంది ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి, రిటైర్డ్ బోర్డు ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. 

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులకు 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65%గా ఉంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పీఎంజీకెవై) కింద కొత్త నిబంధనను రూపొందించింది. ఈపీఎఫ్ సభ్యులు మూడు నెలల ప్రాథమిక వేతనం, కరువు భత్యం(డీఏ) లేదా వారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులో 75 శాతం వరకు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. (చదవండి: డ్రీమ్‌-11కు షాకిచ్చిన క్యాబ్‌ డ్రైవర్‌...!)

ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా..
యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్‌కు వస్తాయి. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్‌స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406  నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.(చదవండి: ఇక నల్లకుబేరుల పని అయిపోయినట్లే!)

మరిన్ని వార్తలు