6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!

23 Dec, 2022 14:37 IST|Sakshi

ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో ఈపీఎఫ్‌ మంథ్లీ పెన్షన్‌ లబ్ధిదారులు తీసుకునే నెలవారీ పెన్షన్‌ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.  

ఎంప్లాయి పెన్షన్‌ స్కీమ్‌-1995 (ఈపీఎస్‌) కమిటీ కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాసింది. పీఎఫ్‌ లబ్ధిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్‌ రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలని డిమాండ్‌ చేసింది. ఆ లేఖపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. 

కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో పీఎఫ్‌ లబ్ధి దారులకు ప్రస్తుతం చెల్లించే నెలవారీ పెన్షన్‌ సరిపోవడం లేదని, అనారోగ్యం వస్తే చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక కొన్ని సార్లు ప్రాణాల్ని పణంగా పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో15 రోజుల్లోగా తమ డిమాండ్లపై కేంద్రం సానుకూల ప్రకటన చేయాలని నేషనల్‌ ఎజిటేషన్‌ కమిటీ కోరింది. లేదంటే రైళ్లు, రోడ్లు నిర్భందిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించింది. 

సుప్రీం కోర్ట్‌ తీర్పు
దీంతో పాటు సుప్రీం కోర్ట్‌ అక్టోబర్‌ 4, 2016, నవంబర్‌ 4,2022లలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కోరింది. బేసిక్‌ శాలరీ రూ.15వేల మించిపోయిన ఉద్యోగులు ఈ ఎంప్లాయి పెన్షన్‌స్కీమ్‌ (ఈపీఎస్‌)కు అనర్హులు. తాజాగా బేసిక్‌ శాలరీ రూ.15వేలు, అంతకన్నా ఎక్కువ ఉన్నా ఈపీఎస్-95 స్కీమ్‌కు కంట్రిబ్యూట్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.

6 కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త?
ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ 1995 లేదా ఈపీఎఫ్‌ -95ని రిటైర్మెంట్ ఫండ్ బాడీ ​​నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇందులో 6కోట్లకు పైగా ఖాతాదారులున్నారు. వారిలో 75 లక్షల మంది  ప్రతి నెల పెన్షన్‌ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈపీఎస్‌ కమిటీ రాసిన లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే 6 కోట్ల ఖాతా దారులకు, పెన్షన్‌ దారులకు లబ్ధి చేకూరనుంది.

చదవండి👉 అలెర్ట్‌: ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా?

మరిన్ని వార్తలు