ఈక్విటాస్‌ స్మాల్‌ బ్యాంక్‌.. వీక్‌ లిస్టింగ్‌

2 Nov, 2020 11:35 IST|Sakshi

6 శాతం నష్టంతో రూ. 31 వద్ద ట్రేడింగ్‌ షురూ

ఐపీవో ధర రూ. 33- ఇష్యూకి రెండు రెట్లు స్పందన

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 517 కోట్లు సమీకరించిన బ్యాంక్‌

ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లను నిరాశపరచింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో 6 శాతం తక్కువగా రూ. 31 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇష్యూ ధర రూ. 33తో పోలిస్తే ఇది 6 శాతం తక్కువకాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప నష్టంతో రూ. 32.45 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 32.65 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 30 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. 

రెండు రెట్లు
కొద్ది రోజుల క్రితం పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రూ. 517 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూకి దాదాపు రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది. ఆఫర్‌లో భాగంగా 11.6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 22.6 కోట్ల షేర్లకోసం దరఖాస్తులు లభించాయి. రిటైల్‌ విభాగం రెండు రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ సాధించింది. ఇష్యూ నిధులను భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా టైర్‌-1 క్యాపిటల్‌ను పటిష్ట పరచుకునేందుకు వినియోగించనున్నట్లు బ్యాంక్‌ ఇప్పటికే తెలియజేసింది. ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ ప్రమోటర్‌గా కలిగిన ఈక్విటాస్‌ స్మాల్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఐపీవోను చేపట్టింది. లైసెన్సింగ్‌ మార్గదర్శకాల ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావలసి ఉంది.

గత రెండేళ్లలో
గత రెండేళ్ల కాలంలో అంటే 2018-20 మధ్య కాలంలో ఈక్విటాస్‌ స్మాల్‌ బ్యాంక్‌ ఆదాయంలో 29 శాతం వృద్ధిని సాధించింది. వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు 39 శాతం, రుణ విడుదల 31 శాతం చొప్పున పుంజుకున్నాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.72 శాతాన్ని తాకగా.. నికర ఎన్‌పీఏలు 1.66 శాతానికి చేరాయి.

మరిన్ని వార్తలు