యూరోపియన్‌ యూనియన్‌ సంచలన నిర్ణయం.. యాపిల్‌ కంపెనీకి పెద్ద దెబ్బే!

4 Oct, 2022 18:37 IST|Sakshi

మొబైల్‌ ఫోన్స్‌, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ కోసం యూరోపియన్‌ యూనియన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ పరికరాలకు సంబంధించి ఇకపై కామన్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉండాలంటూ కొత్త నిబంధనలతో కూడిన చట్టాన్ని ఆమోదించింది. 2024 కల్లా ఈ నిబంధన పూర్తిగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇకపై ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్‌.. ఒకే ఛార్జర్‌  కనిపించనున్నాయి.

యూనివర్సల్‌ ఛార్జింగ్‌ సొల్యూషన్‌ కోసం యూరోపియన్‌ కమిషన్‌ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. యూఎస్‌బీ-సీ టైప్‌ పోర్టల్‌ ఛార్జర్లే అన్ని డివైజ్‌లకీ ఉండాలి. వీటితో పాటు ఇ-రీడర్‌లు, ఇయర్ బడ్స్‌తో పాటు ఇతర సాంకేతిక పరికరాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ క్రమంలో యాపిల్‌ ఐఫోన్‌ (Apple iPhone)లతో పాటు పలు సంస్థలు కూడా వారి ఛార్జింగ్ పోర్ట్‌ను మార్చవలసి ఉంది. యూరోపియన్ కస్టమర్లకు ఎలక్ట్రానిక్ పరికరాలను అందించే సంస్థలలో యాపిల్‌ ప్రధాన సరఫరాదారుడు, దీంతో ఈ నిర్ణయం ఐఫోన్‌ కంపెనీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. 

ఈ నిబంధన ఎందుకంటే!
కస్టమర్లు డివైజ్‌ కొనుగోలు చేసిన ప్రతీసారి కంపెనీలు కొత్త ఛార్జర్లను కూడా ఇస్తుంటాయి. దీంతో పాతది వాడకుండా వ్యర్థంగా మారడం సహజంగా మారుతోంది. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించడంతో పాటు, రీయూజింగ్‌ ద్వారా వేస్టేజ్‌ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై ఈయూలో చాలా ఏళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 

సింగిల్ ఛార్జర్ వినియోగించడం వల్ల దాదాపు EUR 250 మిలియన్లు (దాదాపు రూ. 2016 కోట్లు) ఆదా అవుతుందని యూరోపియన్ కమిషన్ అంచనా. 2018లో మొబైల్ ఫోన్‌లతో విక్రయించిన సగం ఛార్జర్‌లు USB మైక్రో-USB కనెక్టర్‌ను కలిగి ఉండగా, 29 శాతం USB టైప్-సి కనెక్టర్‌ను కలిగి ఉన్నారు. 21 శాతం మంది లైట్నింగ్‌ కనెక్టర్‌ చార్జర్‌ను కలిగి ఉన్నారు.

చదవండి: Youtube: యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్‌.. డబ్బులు చెల్లించాల్సిందేనా!

మరిన్ని వార్తలు