దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?

8 Mar, 2022 15:18 IST|Sakshi

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో అప్పటి నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ మంటను చల్లార్చేందుకు కేంద్రం ప్రభుత్వం అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో చాలా మంది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తుంది. అయితే, కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా ఉండటానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. 

ప్రపంచ ముడిచమురు ధరల ప్రభావం నుంచి వినియోగదారులను రక్షించడానికి డీజిల్, పెట్రోల్ విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.10-12 తగ్గించాల్సి అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ముందు వేరే మార్గం లేదని మాజీ ఆర్థిక కార్యదర్శి తెలిపారు. "ఆదాయంపై ప్రభావం పడకుండా చమురు రిటైల్ ధరలు తగ్గే మార్గం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 నుంచి రూ.12కు తగ్గించాల్సి ఉంది. ప్రస్తుతం వేరే మార్గం లేదు" అని సుభాష్ చంద్ర గార్గ్ సీఎన్ బిసీ-టీవీ18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మార్చి 7న బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధరలు 139 డాలర్లకు చేరుకున్నాయి.

అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు రష్యన్ చమురుపై నిషేధాన్ని విధిస్తాయని వచ్చిన వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిన తర్వాత రూపాయి మారకం విలువ భారీగా క్షీణించింది. ఇది దేశీయ ఇంధన ధరలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. చమురు ధరలు పెంచడం వల్ల ద్రవ్యోల్పణం పెరిగి జీడిపీ మీద ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు. అలాగే, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది అని సుభాష్ అన్నారు.

(చదవండి: అబ్బే..అలాంటిదేం లేదు! రష్యా వార్నింగ్‌తో మాట మార్చిన అమెరికా?)

మరిన్ని వార్తలు