ఏం జరుగుతోంది, ఊడిపోతున్న ఉద్యోగాలు.. ఫేస్‌బుక్‌లో 11వేల మందిపై వేటు!

9 Nov, 2022 21:34 IST|Sakshi

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం కంపెనీలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులపై తాజాగా స్పందించారు. తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం ( 11,000 మందికి) పైగా ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా జుకర్‌బర్గ్‌ తెలిపారు.

ఫేస్‌బుక్‌ సీఈఓ ఉద్యోగులకు రాసిన లేఖలో.. “ఈ రోజు నేను మెటా చరిత్రలో చేసిన కొన్ని కష్టతరమైన మార్పులను షేర్ చేస్తున్నాను. నేను మా బృందం పరిమాణాన్ని సుమారు 13% తగ్గించాలని నిర్ణయించుకున్నాను. మా ప్రతిభావంతులైన ఉద్యోగులలో 11,000 కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నాం.

ఇది నాకు ఎంతో బాధను కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు జుకర్‌బర్గ్‌. ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ హెచ్‌ఆర్‌ విభాగం అధిపతి లోరీ గోలెర్ తెలిపారు. ఇక ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో భారీగా తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం

అకస్మాత్తుగా ఉద్యోగుల తొలగింపుకు ప్రధాన కారణాలు..కంపెనీ ఖర్చను భారీగా తగ్గించుకోవడం, ఆర్ధిక మాంద్యం కారణంగా సంస్థలు అడ్వటైజ్‌మెంట్‌లకు కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవడం, కంపెనీని ఇటీవల వరుసగా చుట్టుముడుతున్న వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఆ బ్యాంక్‌ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు!

మరిన్ని వార్తలు