వివాదాస్పద ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా

28 Oct, 2020 11:08 IST|Sakshi

 పదవినుంచి తప్పుకున్న  ఫేస్‌బుక్  ఇండియా పాలసీ హెడ్ అంఖిదాస్ 

బీజేపీలో చేరతారనే అంచనాలు

2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలోకి?

సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ ఇండియా వివాదాస్పద పాలసీ హెడ్ అంఖిదాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియాలో మొదటి ఉద్యోగి అయిన అంఖి దాదాపు 9 సంవత్సరాల పాటు భారత, సౌత్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల వృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవకు కృతజ్ఞతలు ప్రకటించారు.

బిహార్ ఎన్నికల్లో ఈ పార్టీకి ఫేవర్ గా కంపెనీ మోడరేషన్ పాలసీని అంఖిదాస్ రూపొందించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆమె రాజీనామాకు, ఈ వివాదానికి సంబంధం లేదని, అంఖిదాస్ ప్రజాసేవ  చేయాలనే ఉద్దేశంతో తనకు తానే స్వయంగా ఈ పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని అజిత్ మోహన్ స్పష్టం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఆపార్టీ నేతల ద్వేష పూరిత ప్రసంగాల పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలతో అంఖిదాస్ వివాదంలో పడిన సంగతి తెలిసిందే. 

మరోవైపు ఆమె త్వరలోనే బీజేపీలో చేరవచ్చనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో  అంఖిదాస్ నిలిచే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ప్రజా సేవపై ఆసక్తి చూపడం అంటే 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ టికెట్ పొందడమే?  రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటూ ఆమె ట్వీట్ చేశారు.  కాగా బీజేపీ నేతల ప్రసంగాలను ఫేస్ బుక్ చూసీ చూడనట్టు వదిలేస్తోందని గత ఆగస్టులో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. దీనిపై కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వాన గల పార్లమెంటరీ కమిటీ కూడా ప‌లు భ‌ద్రతా అంశాల‌పై  ఫేస్ బుక్ ప్రతినిధులను  ప్రశ్నించింది.  

మరిన్ని వార్తలు