ఫేస్‌‘బుక్‌'పై భారీ జరిమానా

28 Feb, 2021 19:04 IST|Sakshi

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. ఫేసుబుక్ వినియోగదారుల అనుమతి లేకుండా ఫోటో ఫేస్-ట్యాగింగ్, ఇతర బయోమెట్రిక్ డేటాను ఉపయోగించడంపై 650 మిలియన్ డాలర్లు(సుమారు రూ.4,780 కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్‌బుక్ భంగం కలిగిందంటూ అమెరికాలోని ఇల్లినాయిస్లో 2015లో దాఖలు చేసిన క్లాస్-యాక్షన్ పిటిషన్‌పై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో విచారణ చేపట్టారు. ఇల్లినాయిస్లో దాదాపు 1.6 మిలియన్ల మంది ఫేసుబుక్ వినియోగదారులు వాదనలు సమర్పించారు. 

విచారణ చేపట్టిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో ఫేస్‌బుక్ ప్రైవసీ పాలసీ నిబంధనలను పాటించలేదని తీర్పునిచ్చారు. ఇది యూజర్ల గోప్యత భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. ఫేసుబుక్ వల్ల భంగం కలిగిన ప్రతి ఒక్కరికి 345 డాలర్ల చొప్పున మొత్తం 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసుల్లో ఇంత మొత్తంలో నష్ట పరిహారం చెల్లించడం ఇదే తొలిసారని జడ్జి డొనాటో వెల్లడించారు. పిటీషన్ వేసిన చికాగో న్యాయవాది జే ఎడెల్సన్ చికాగో ట్రిబ్యూన్‌తో మాట్లాడుతూ తీర్పును అప్పీల్ చేయకపోతే ఫేస్‌బుక్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ ప్రతినిధి స్పందిస్తూ.. తమ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడమే కర్తవ్యమన్నారు. ఈ విషయంపై పునరాలోచన చేయనున్నట్లు వెల్లడించారు.

చదవండి:

రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్

మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు

మరిన్ని వార్తలు