పారిశ్రామిక ఉత్పత్తి ఓకే!

12 Mar, 2022 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో 1.3 శాతం పురోగతి (2021 ఇదే కాలంతో పోల్చి) సాధించింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు విడుదల చేసింది. 2021 జనవరిలో ఐఐపీలో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 0.6 శాతం క్షీణతలో ఉంది. 2021 డిసెంబర్‌లో వృద్ధి రేటు కేవలం 0.7 శాతంగా ఉంది. మైనింగ్, మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగాలు తాజా సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉండగా, భారీ పెట్టుబడులకు ప్రాతిపదిక అయిన క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగం ఇంకా క్షీణతలోనే ఉంది.  

ఏప్రిల్‌ నుంచి జనవరి వరకూ 13.7 శాతం వృద్ధి 
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్‌ నుంచి 2022 జనవరి వరకూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 13.7 శాతంగా నమోదయ్యింది. దీనికి లో బేస్‌ ఎఫెక్ట్‌ కూడా ఒక కారణం.  ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. ఇక్కడ 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలాన్ని పరిశీలిస్తే, అసలు వృద్ధిలేకపోగా  12 శాతం క్షీణత నమోదయ్యింది.

2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట...
మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్‌డౌన్‌ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్‌ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా కనబడింది.  పలు నెలల నుంచి క్షీణతలో కొనసాగిన పారిశ్రామిక ఉత్పత్తి 2021 మార్చి నుంచి స్థిరంగా సానుకూల శ్రేణిలో కదిలింది.  

కీలక గణాంకాలను పరిశీలిస్తే...

చదవండి: రిస్క్‌ ప్రాజెక్టులకు ఈక్విటీ నిధులే బెటర్‌!

మరిన్ని వార్తలు