తగ్గనున్న టూ వీలర్‌ ధరలు.. ఈవీలపై సబ్సిడీ పెంపు

12 Jun, 2021 13:04 IST|Sakshi

సబ్సిడీ 20 శాతం నుంచి 40 శాతానికి పెంపు

1 kWh ఈవీపై రూ. 15,000 సబ్సిడీ వర్తింపు

భారీగా తగ్గనున్న ఈవీ టూవీలర్‌ ధరలు

ఇప్పటికే ధరలు తగ్గించిన అథర్‌ సంస్థ

వెబ్‌డెస్క్‌ : ఎలక్ట్రికల్‌ వెహికల్‌ మార్కెట్‌కి మరింత ఊతం ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఎలక్ట్రికల్‌ వెహికల్‌ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

1 kWhకి రూ.15,000 

ప్రస్తుతం ఈవీ వెహికల్స్‌ తయారీకి సంబంధించి కిలోవాట్‌ పర్‌ అవర్‌ సామర్థ్యం కలిగిన బైక్‌ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్‌ అవర్‌ (kWh) సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ. 15,000 సబ్సిడీ లభిస్తోంది. ఇలా  2 kWh  బైక్‌పై రూ. రూ. 30,000 సబ్సిడీ 3 kWh బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర మించని బైకులకు ఈ  సబ్సడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. 

అథర్‌ స్పందన
ఈవీ వెహికల్స్‌పై సబ్సిడీని ఒకేసారి 50 శాతానికి పైగా పెంచడంతో అథర్‌ సంస్థ తన స్కూటర్ల ధరలను వెంటనే తగ్గించింది. అథర్‌ 450ఎక్స్‌ మోడల్‌పై రూ. 14,500 ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈవీ అమ్మకాలు జోరందుకుంటాయని అథర్‌ ఫౌండర్‌ తరుణ్‌ మెహతా ప్రకటించారు. రివోల్ట్‌ మోటార్స్‌ దీన్ని గేమ్‌ ఛేంజర్‌గా ప్రకటించింది. మరిన్ని కంపెనీలు ధరలు తమ ఈవీల తగ్గించే పనిలో పడ్డాయి. 

డిమాండ్‌ పెంచేందుకే
ప్రస్తుతం మార్కెట్‌లో మైలేజ్‌, ఛార్జింగ్‌ పరంగా 2 kWh సామార్థ్యం  ఉన్న బైకులు పెట్రోలు బైకులకు ప్రత్యామ్నయంగా ఉ‍న్నాయి. అయితే ధరల విషయంలో పోల్చినప్పుడు పెట్రోలు బైకుల కంటే ఈవీ బైకుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కష్టమర్ల నుంచి ఆశించిన మేరకు డిమాండ్‌ రావడం లేదు. దీంతో సబ్సిడీ ఇవ్వడం ద్వారా వెహికల్స్‌ ధర తగ్గించి,  డిమాండ్‌ పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. 
 

ఫేమ్‌ 2
ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ (FAME) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా ఫేమ్‌ 2లో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. దీని కోసం కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది. 

చదవండి: బాబోయ్‌ పెట్రోల్‌.. భవిష్యత్తు హైపర్‌ ఛార్జర్లదే

మరిన్ని వార్తలు