ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో ఆన్‌లైన్‌ జోరు!

10 Nov, 2020 05:21 IST|Sakshi

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వృద్ధి

ప్రతి కంపెనీ సేల్స్‌లో 2–8 శాతం వాటా ఈ–కామర్స్‌దే

న్యూఢిల్లీ:  దేశీయ ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు రూటు మార్చేశాయి. కొనుగోలుదారులు ఈ–కామర్స్‌ బాటపట్టడంతో ఎఫ్‌ఎంసీజీలు కూడా అదే బాటపట్టాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో మొదలైన ఎఫ్‌ఎంసీజీల ఈ–కామర్స్‌ సేల్స్‌ క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా కంపెనీల మొత్తం అమ్మకాల్లో ఆన్‌లైన్‌ వాటా 2–8 శాతం వరకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆన్‌లైన్‌ అమ్మకాలు రికార్డ్‌ స్థాయిలో జరిగాయి.

2020లో 3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీయ ఈ–గ్రాసరీ మార్కెట్‌ 2024 నాటికి 18.2 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని రెడ్‌సీర్, బిగ్‌బాస్కెట్‌ నివేదిక అంచనా వేసింది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలైన నెస్లే, హిందుస్తాన్‌ యూనిలివర్, పార్లే ప్రొడక్ట్స్, అమూల్, మారికో వంటి సంస్థల ఆన్‌లైన్‌ అమ్మకాలు క్యూ2లో అధిక స్థాయిలో జరిగాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేసినా సరే కొనుగోలుదారులు ఈ–కామర్స్‌ కొనుగోళ్ల మీదే మక్కువ చూపించడమే ఈ వృద్ధికి కారణం. గతేడాది హెచ్‌యూఎల్‌ మొత్తం అమ్మకాల్లో 3 శాతంగా ఉన్న ఆన్‌లైన్‌ అమ్మకాలు ఈ ఏడాది క్యూ2 నాటికి 6 శాతానికి పెరిగింది. నెస్లే కంపెనీ ఈ–కామర్స్‌ సేల్స్‌ కూడా సెప్టెంబర్‌ నాటికి రెట్టింపయింది. ‘గతేడాదితో పోలిస్తే నెస్లే ఆన్‌లైన్‌ సేల్స్‌లో 97 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్‌ వాటా 4 శాతంగా ఉందని’’ నెస్లే చైర్మన్‌ సురేష్‌ నారాయనన్‌ తెలిపారు.

ప్యాకేజ్‌ ఫుడ్స్‌కు డిమాండ్‌..
కొనుగోలుదారులు ఇంట్లో ఉంటూ ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ను ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు. అందుకే మ్యాగీ నూడుల్స్, మంచ్, కిట్‌క్యాట్‌ చాక్‌లెట్స్‌ అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఈ–గ్రాసరీ షాపింగ్‌ జోరుగా సాగింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేసినా సరే ఈ–కామర్స్‌దే హవా నడుస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఈ–కామర్స్‌ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తొలిసారి ఆన్‌లైన్‌ కొనుగోలుదారులు ఎక్కువగా గ్రాసరీలను కొంటున్నారని పార్లే ప్రొడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ మయాంక్‌ షా తెలిపారు. గతేడాది 2.3 శాతంగా ఉన్న ఐటీసీ కంపెనీ ఆన్‌లైన్‌ అమ్మకాలు గత 12 నెలల్లో 4.2 శాతానికి పెరిగింది. ఐటీసీ ఉత్పత్తులైన సన్‌ఫీస్ట్‌ బిస్కెట్లు, ఆశీర్వాద్‌ పిండి ఆన్‌లైన్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడాదిక్రితం డాబర్‌ అమ్మకాల్లో 1.5 శాతంగా ఉన్న ఆన్‌ౖ లెన్‌ సేల్స్‌ వాటా ప్రస్తుతం 6 శాతానికి పెరిగింది.

2–8 శాతం ఆన్‌లైన్‌ వాటా..
దేశంలోని అన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో ఆన్‌లైన్‌ వాటా కనీసం 2–8 శాతం మధ్య ఉన్నాయి. ఈ–కామర్స్‌ వృద్ధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలాది స్థానిక కిరాణా స్టోర్లు కూడా ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. గ్రాసరీ మార్కెట్లో ఆన్‌లైన్‌ వాటా 0.5 శాతంగా మాత్రమే ఉంది. ఆరు నెలల వ్యవధిలో అమూల్‌ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలు 3 శాతం నుంచి 7–8 శాతానికి పెరిగిందని కంపెనీ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి తెలిపారు. రాబోయే కాలంలో మరింత వృద్ధి కనబరుస్తుందని పేర్కొన్నారు. ఈ–కామర్స్‌ అమ్మకాలు దీర్ఘకాలిక వృద్ధిని నమోదు చేస్తాయని మారికో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సంజయ్‌ మిశ్రా తెలిపారు. మారికో ఉత్పత్తులైన పారాచ్యూట్‌ హెయిర్‌ ఆయిల్, సఫోలా ఓట్స్‌ ఉత్పత్తులు సెప్టెంబర్‌ త్రైమాసికంలో 39 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో ఆన్‌లైన్‌ వాటా 8 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు