ఇండియన్ పబ్‌జీ...ఫౌజీ వచ్చేస్తోంది!

4 Sep, 2020 18:21 IST|Sakshi

ఫౌజీ పేరుతో కొత్త భారతీయ యాక్షన్ గేమ్

ఫౌ జీని పరిచయం చేసిన అక్షయ్ కుమార్, విశాల్ గోండల్

సాక్షి, న్యూఢిల్లీ: పబ్‌జీ సహా 118 చైనీస్ మొబైల్ యాప్ లపై కేంద్రం నిషేధం నేపథ్యంలో ఇండియన్ పబ్‌జీ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ కొత్త యాక్షన్ గేమ్‌ను శుక్రవారం పరిచయం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మల్టీప్లేయర్ యాక్షన్-గేమ్ ఫౌ-జీని ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ట్విటర్ లో పోస్ట్ చేశారు. వినోదంతో పాటు ఆటగాళ్ళు మన సైనికుల త్యాగాల గురించి కూడా తెలుసుకుంటారని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీ పేరుతో ఇండియన్ యాప్ ను బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్ రూపొందించింది. అక్షయ్ కుమార్ తోపాటు, పారిశ్రామికవేత్త, జీవోక్యూఐఐ ఫౌండర్, సీఈవో విశాల్‌ గోండల్‌ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని ఆదాయంలో 20 శాతం నిధులను భారత్ కే వీర్‌కు విరాళంగా ఇస్తామని తెలిపారు. అయితే అధికారికంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ వివరించలేదు. అలాగే ఈ గేమ్ మొబైల్ పరికరాలకే పరిమితం అవుతుందా లేదా పీసీ వెర్షన్ కూడా వస్తుందా అనేదానిపై కూడా స్పష్టత లేదు. కాగా1999 లో ఇండియా గేమ్స్ ను ప్రారంభించిన విశాల్ గోండల్ 2011లో దీన్ని డిస్నీకి విక్రయించారు. గత ఏడాది మార్చిలో ఎన్‌కోర్ గేమ్స్‌లో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు. అలాగే స్టార్టప్‌కు వ్యూహాత్మక సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు