బంగారం కొత్త రికార్డులకు..!

9 Mar, 2022 07:50 IST|Sakshi

అంతర్జాతీయంగా, దేశీయంగా పరుగుఒకే రోజు 70 డాలర్లు అప్‌   

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి బంగారంలోకి వేగంగా మళ్లిస్తున్నారు. దీంతో యల్లో మెటల్‌ అంతర్జాతీయ మార్కెట్, దీనికి అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో మెరిసిపోతోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సేంజీలో ఔన్స్‌ (31.1 గ్రాములు) ధర మంగళవారం క్రితం ముగింపుతో పోల్చితే 72 డాలర్ల లాభంతో (3.6 శాతం) 2,068 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

కరోనా తర్వాత
కరోనా తీవ్రత నేపథ్యంలో 2020 ఆగస్టులో 2,121 డాలర్లకు చేరి... 2,063 స్థాయిలో ముగిసింది.  అయితే మహమ్మారి సవాళ్లు తగ్గుముఖం పడుతున్న కొద్దీ గత ఏడాది నవంబర్‌ నాటికి 1,680 డాలర్ల వరకూ దిగివచ్చింది. ఈ స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతుతో తిరిగి దాదాపు 1,800 డాలర్ల స్థాయికి ఎగసింది. అటు తర్వాత  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదనంతర పరిణామాలు తిరిగి పసిడికి మెరుపును తీసుకువచ్చింది. 

రూపాయి విలువ
అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా రూపాయి కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో బంగారం 10 గ్రాముల ధర భారత్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్ంజీలో 2022 మార్చి 8 రాత్రి 11 గంటల సమయంలో రూ.2,000 లాభంతో రూ.55,500 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.55,650 స్థాయిని కూడా చూసింది. దేశీయ స్పాట్‌ మార్కెట్‌లో బుధవారం ధర రూ.2,000 వరకూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
 

మరిన్ని వార్తలు