redseer: పండుగ సీజన్‌లో 9 బిలియన్‌ డాలర్ల బిజినెస్‌, అమ్మకాలపై అంచనా

25 Sep, 2021 12:09 IST|Sakshi

ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు స్థూలంగా 9 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను (జీఎంవీ) విక్రయించే అవకాశం ఉందని కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ తెలిపింది. గతేడాది ఇదే సీజన్‌లో నమోదైన 7.4 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి కనపర్చే అవకాశం ఉందని పేర్కొంది.

పూర్తి ఏడాదికి మొత్తం ఆన్‌లైన్‌ స్థూల జీఎంవీ 49–52 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండవచ్చని, గతేడాదితో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఈ–కామర్స్‌ పండుగ సీజన్‌ నివేదికలో రెడ్‌సీర్‌ అంచనా వేసింది. ఆర్డర్ల రద్దు, వాపసు చేయడం మొదలైన వాటిని తీసివేయడానికి ముందు, స్థూలంగా అమ్ముడైన ఉత్పత్తుల మొత్తం విలువను స్థూల జీఎంవీగా వ్యవహరిస్తారు. 

కోవిడ్‌ తరవాత పరిసథితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ గణనీయంగా పెరగడం.. అమ్మకాల వృద్ధికి దోహదపడగలదని రెడ్‌ సీర్‌ తెలిపింది. కొత్త మోడల్స్‌ ఆవిష్కరణల ఊతంతో మొబైల్స్‌ విక్రయాలు అత్యధికంగా ఉండగలవని, ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్‌..గృహోపకరణాలు మొదలైనవి ఉంటాయని పేర్కొంది.   

చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది

మరిన్ని వార్తలు