ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతాయి..  

24 Sep, 2022 18:11 IST|Sakshi

పీజీఐఎం ఇండియా ఎంఎఫ్‌ హెడ్‌ అనిరుద్ధ నాహా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు మెరుగైన పనితీరే కనబరుస్తున్నా యని పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ హెడ్‌ (ఈక్విటీస్‌) అనిరుద్ధ నాహా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) విక్రయాలను కొనసాగిస్తారని, నిధులను ఇతర మార్కెట్లలోకి తిప్పుతుంటారని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా ఎఫ్‌ఐఐలు విక్రయించడం, దేశీ సంస్థలు  కొనుగోళ్లు జరుపుతుండటం కొనసాగుతోందని నాహా చెప్పారు. భారీ అమ్మకాలు వెల్లువెత్తుతున్నా, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతు న్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు పరిణితితో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

దేశీ మదుపుదారుల పెట్టుబడులు కొనసాగుతుండటంతో ఎఫ్‌ఐఐల అమ్మకాల ఒత్తిడిని తట్టుకుని మార్కెట్లు నిలబడు తున్నాయన్నారు. మార్కెట్లు మరికొంత కరెక్షన్‌కి లోనుకావచ్చని, అయితే ఈక్విటీలకు కేటాయింపులు జరిపేందుకు.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు ఇది సరైన సమయమని నాహా చెప్పారు. భారతీయులు సాధారణంగా ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్‌లకు ఎక్కువగా కేటాయించరని, ప్రస్తుతం ఆ ధోరణి మారుతోందని తెలిపారు.  

మరోవైపు, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ మెరుగైన రాబడులు పొందేందుకు, ట్యాక్సేషన్‌పరంగా ప్రయోజనకరంగా ఉండేందుకు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ (బీఏఎఫ్‌) ఆకర్షణీయంగా ఉంటున్నాయని నాహా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే పీజీఐఎం ఇండియా బీఏఎఫ్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. మార్కెట్‌ వేల్యుయేషన్స్‌ అధిక స్థాయిలో ఉన్నప్పుడు కొంత ఈక్విటీ భాగాన్ని హెడ్జ్‌ చేసి, డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తామని.. తద్వారా మార్కెట్‌ పతనమైన పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుందని నాహా చెప్పారు. అలాగే తక్కువ స్థాయిలో కొనుగోలు చేసి అధిక స్థాయిలో విక్రయించే సూత్రాన్ని పాటిస్తాం కాబట్టి మెరుగైన రాబడులు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు