దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు.. !

17 Mar, 2022 15:29 IST|Sakshi

జనవరిలో తొలిసారిగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ అమ్మకాలు 4జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను అధిగమించినట్లు మార్కెట్ ఎనలిటిక్స్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. చైనా, ఉత్తర అమెరికా, యూరప్ వంటి దేశాలలో 5జీ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు కౌంటర్ పాయింట్ పేర్కొంది. అలాగే, ఈ మొబైల్ మన దేశంలో కూడా ఊపందుకున్నాయి. "5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 2021(భారతదేశంలో) మొత్తం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలలో 16 శాతంగా ఉన్నాయి. 2020లో 3 శాతంగా ఉన్న అమ్మకాలు 2021 నాటికి 16 శాతానికి పెరిగాయి. 2022లో 5జీ అమ్మకాలు సుమారు 40%కి చేరుకుంటుందని మేము అంచనా వేస్తాము" అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు కర్ణ్ చౌహాన్ చెప్పారు. 

5జీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు ₹12,000కు తగ్గితే 2022 క్యూ4లో 50 శాతానికి చేరే అవకాశం ఉందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. మార్చి 15న ప్రచురితమైన నోకియా ఇండియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో లేనప్పటికీ 10 మిలియన్ వినియోగదారులు 5జీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసినట్లు తెలిపింది. 5జి స్మార్ట్ ఫోన్లు జనవరిలో చైనాలో మొత్తం అమ్మకాల్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 84% వాటాను కలిగి ఉన్నాయి. క్వాల్ కామ్, మీడియాటెక్ కంపెనీలు తక్కువ ధరకే 5జీ సపోర్ట్ గల చిప్స్ అందుబాటులోకి తీసుకొని రావడంతో అమ్మకాల పెరిగినట్లు కౌంటర్ పాయింట్ తెలిపింది. 

మొత్తం మొబైల్ ఫోన్ అమ్మకాల్లో పశ్చిమ ఐరోపాలో 76%, ఉత్తర అమెరికాలో 73% 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు వాటాను కలిగి ఉన్నాయి. పశ్చిమ ఐరోపాలో మొత్తం 5జీ అమ్మకాల్లో 30%, ఉత్తర అమెరికాలో 50% వాటా యాపిల్ కంపెనీకే ఉంది. ఇక మన దేశంలో 5జీ నెట్‌వర్క్‌ లేకపోవడంతో ఆ మొబైల్స్ అమ్మకాలు తక్కువగానే ఉన్న ఈ ఏడాది నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది. దేశీయ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) ఈ ఏడాది ఎప్పుడైనా 5జీ స్పెక్ట్రం కోసం వేలం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని ప్రధాన టెల్కోలు భారతదేశం అంతటా 5జీ ట్రయల్స్ నిర్వహించాయి.

(చదవండి: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గనున్నాయా..?)

మరిన్ని వార్తలు