దూసుకుపోతున్న షేర్‌చాట్‌, ఇతర స్టార్టప్‌ కంపెనీలు

27 Apr, 2021 17:31 IST|Sakshi

ముంబై: భారత్‌లో స్టార్టప్‌ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్‌ కంపెనీలు యూనికార్న్‌ క్లబ్‌లోకి చేరగా, ఈ సారి 2021 మొదటి నాలుగు నెలల్లో మరో ఐదు స్టార్టప్‌ కంపెనీలు యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించాయి. మీషో, గ్రోవ్‌, షేర్‌చాట్‌, ఏపీఐ హోల్డింగ్స్‌, గప్‌షుప్‌ కంపెనీలు యూనికార్న్‌ కంపెనీలుగా అవతారమెత్తాయి. ప్రస్తుతం ఈ కంపెనీల వాల్యూ సుమారు ఒక బిలియన్‌ డాలర్ల వరకు చేరింది.

భారత్‌లో కామర్స్‌ రంగంలో దూసుకుపోతున్న మీషో కంపెనీ ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ నుంచి సుమారు 300 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ను సేకరించడంతో కంపెనీ వాల్యూ 2.1 మిలియన్‌ డాలర్లకు చేరింది. 2017లో స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాం గ్రోవ్‌ కంపెనీ టైగర్‌ గ్లోబల్‌ నుంచి సుమారు 83 మిలియన్‌ డాలర్లును సేకరించడంతో కంపెనీ వాల్యూ బుధవారం రోజున ఒక బిలియన్‌ డాలర్లకు చేరింది. 

భారత్‌లో 2017లో ప్రారంభమైన గ్రోవ్ 1.5 కోట్లకు పైగా నమోదైన వినియోగదారులతో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా మారింది. గ్రోవ్‌లో వినియోగదారులు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇటిఎఫ్‌లు, ఐపిఓలు, బంగారంలో సరళమైన, ఏలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు.

ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ ఈజీ ఏపీఐ హోల్డింగ్ వ్యవస్థాపకుడు బుధవారం యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించమని తెలిపారు. ప్రోసస్ వెంచర్స్, టీపీజీ గ్రోత్ నుంచి సుమారు 350 మిలియన్ డాలర్లను సమీకరించిన తరువాత స్టార్టప్‌ వాల్యూ 1.5 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. మరో మేసేజింగ్‌ కంపెనీ గప్‌షుప్‌ గురువారం టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులను సేకరించడంతో, కంపెనీ విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరింది.

చదవండి: SBI Card: ఎస్‌బీఐ కార్డ్‌ లాభాలు రెట్టింపు

మరిన్ని వార్తలు