ఫ్లెక్స్‌పే డిజిటల్‌ క్రెడిట్‌ కార్డ్‌

15 Oct, 2020 05:43 IST|Sakshi

అందుబాటులోకి తెచ్చిన వివిఫై

రూ.2 లక్షల దాకా ఇన్‌స్టంట్‌ క్రెడిట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ అయిన హైదరాబాద్‌కు చెందిన వివిఫై ఇండియా ఫైనాన్స్‌.. ఫ్లెక్స్‌పే పేరుతో భారత్‌లో తొలిసారిగా యూపీఐ చెల్లింపుల ఆధారిత డిజిటల్‌ క్రెడిట్‌ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్‌ తనకున్న క్రెడిట్‌ లిమిట్‌ మేరకు ఫ్లెక్స్‌పే యాప్‌ ద్వారా దుకాణాల్లో యూపీఐ క్యూఆర్‌ కోడ్స్, యూపీఐ ఐడీని స్కాన్‌ చేసి చెల్లింపులు జరపవచ్చు. లేదా తన బ్యాంకు ఖాతాకు క్రెడిట్‌ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. కస్టమర్‌ ఆదాయం, గతంలో తీసుకున్న రుణం, చెల్లింపుల తీరు, సిబిల్‌ స్కోర్, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వంటివి ఆధారంగా చేసుకుని 15 నిమిషాల్లో డిజిటల్‌ క్రెడిట్‌ కార్డ్‌ రెడీ అవుతుంది. రూ.500 మొదలుకుని రూ.2 లక్షల వరకు క్రెడిట్‌ లిమిట్‌ పొందవచ్చు. క్రెడిట్‌ లిమిట్, వినియోగదారుడినిబట్టి వడ్డీ ఏడాదికి 36 శాతం వరకు వసూలు చేస్తారు. వాడుకున్న మొత్తాన్ని గరిష్టంగా 36 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.  

ఎలా పనిచేస్తుందంటే..
ఫ్లెక్స్‌పే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి, పాన్‌ కార్డ్, గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. కంపెనీ ఏజెంట్‌ వీడియో కాల్‌ ద్వారా కస్టమర్‌ను, పత్రాలను ధ్రువీకరించుకుంటారని వివిఫై ఇండియా ఫైనాన్స్‌ ఫౌండర్‌ అనిల్‌ పినపాల బుధవారం తెలిపారు.
‘15 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. 5,000 డేటా పాయింట్ల ఆధారంగా కస్టమర్‌ అర్హుడా కాదా, ఎంత క్రెడిట్‌ ఇవ్వాలనేది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చెబుతుంది. నగదు వాడుకున్న కాలానికే వడ్డీ ఉంటుంది. అంటే రెండు రోజుల్లో కూడా వెనక్కి చెల్లించవచ్చు. ఇప్పటికే 30,000 మంది ఫ్లెక్స్‌పే కస్టమర్లు ఉన్నారు. 2017లో ప్రారంభమైన వివిఫై ఇప్పటి వరకు 60,000 మంది వినియోగదార్లకు రూ.220 కోట్లు రుణంగా ఇచ్చింది’ అని ఆయన వివరించారు.
వివిఫై ఫౌండర్‌ అనిల్‌

మరిన్ని వార్తలు