ఫ్లిప్‌కార్ట్‌ చేతికి యాంత్రా

14 Jan, 2022 02:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ తాజాగా ఎలక్ట్రానిక్స్‌ ’రీ–కామర్స్‌’ కంపెనీ ’యాంత్రా’ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ వెల్లడి కాలేదు. గ్రూప్‌ సంస్థ ఎఫ్‌1 ఇన్ఫో సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ ఈ డీల్‌ కుదుర్చుకుంది. 2013లో జయంత్‌ ఝా, అంకిత్‌ సరాఫ్, అన్‌మోల్‌ గుప్తా కలిసి యాంత్రాను ప్రారంభించారు. ఇది స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన కన్జూమర్‌ టెక్నాలజీ ఉత్పత్తులను రిపేరు చేసి  విక్రయిస్తుంది.

మరోవైపు, ఎఫ్‌1 ఇన్ఫో సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ .. ప్రధానంగా వ్యాపార వర్గాల కోసం వివిధ ఉత్పత్తులకు (కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, ఐటీ..ఐటీ పెరిఫెరల్స్‌ మొదలైనవి) రిపేరు, రీఫర్బిష్‌మెంట్‌ సర్వీసులు అందిస్తోంది. యాంత్రా కొనుగోలుతో రీఫర్బిష్డ్‌ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌ మరింత చౌకగా అందుబాటులోకి తేవడానికి వీలవుతుందని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రకాష్‌ సికారియా తెలిపారు. టెక్నాలజీని చౌకగా, అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమని యాంత్రా సహ వ్యవస్థాపకుడు జయంత్‌ ఝా తెలిపారు. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు