ఫ్లిప్‌కార్ట్‌ నుంచి విడివడ్డ ఫోన్‌పే

24 Dec, 2022 06:22 IST|Sakshi

వాల్‌మార్ట్‌ మాతృ సంస్థగా కార్యకలాపాలు 

న్యూఢిల్లీ: ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ నుంచి డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ ఫోన్‌పే విడివడింది. ఇకపై రెండు సంస్థలూ వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. ఈ రెండింటికీ యూఎస్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ మాతృ సంస్థకాగా.. ఫోన్‌పేను 2016లో ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ కొనుగోలు చేసింది. తాజా లావాదేవీలో భాగంగా వాల్‌మార్ట్‌ ఆధ్వర్యంలోని ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌ సింగపూర్, ఫోన్‌పే సింగపూర్‌ వాటాదారులు ఫోన్‌పే ఇండియాలో ప్రత్యక్షంగా షేర్లను కొనుగోలు చేసినట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

వెరసి ఫోన్‌పే భారత కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ఈ ప్రాసెస్‌ తాజాగా పూర్తయినట్లు వెల్లడించింది. రెండు బిజినెస్‌ గ్రూపులలోనూ వాల్‌మార్ట్‌ మెజారిటీ వాటాదారుగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. ఒక్కో కంపెనీ 40 కోట్ల యూజర్‌ బేస్‌ ద్వారా దేశీ దిగ్గజాలుగా ఎదిగినట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ నిగమ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫోన్‌పే స్వస్థలాన్ని(డొమిసైల్‌) సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్పు చేసుకున్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు