సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల జారీకి ఫ్రేమ్‌వర్క్‌

10 Nov, 2022 04:35 IST|Sakshi

రూ.16,000 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ:  ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సావరీన్‌ గ్రీన్‌ బాండ్లను జారీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (2022–23 అక్టోబర్‌–మార్చి)  గ్రీన్‌ బాండ్ల జారీ ద్వారా రూ.16,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం కేంద్ర రుణ సమీకరణలో (రూ.5.92 లక్షల కోట్లు) ఈ నిధులు భాగం కానున్నాయి.  

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2022–23 బడ్జెట్‌లో సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల జారీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ప్యారిస్‌ ఒప్పందం లక్ష్యాలపై భారత్‌ నిబద్ధతను ఈ ఫ్రేమ్‌వర్క్‌ బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే అర్హతగల గ్రీన్‌ ప్రాజెక్ట్‌ల్లోకి  ప్రపంచ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు.  

ఫ్రేమ్‌వర్క్‌లో ముఖ్యాంశాలు...
► గ్రీన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఎకానమీలో కార్బన్‌ తీవ్రత తగ్గింపు లక్ష్యంగా జారీఅయ్యే ఈ రూపాయి డినామినేటెడ్‌ బాండ్ల  సుదీర్ఘ కాల వ్యవధిని కలిగి ఉంటాయి.
► గ్రీన్‌ బాండ్‌ల జారీకి గరిష్టంగా 12 నెలల ముందు జరిగిన ప్రభుత్వ వ్యయాలకు ఈ సమీకరణ నిధులు పరిమితమవుతాయి. అలాగే జారీ చేసిన 24 నెలల్లోపు మొత్తం ఆదాయాన్ని ప్రాజెక్టులకు కేటాయించేలా కృషి జరగనుంది.  
► గ్రీన్‌ బాండ్ల జారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని శిలాజ ఇంధనాల వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ లేదా అణు విద్యుత్‌ ప్రాజెక్టులకు వినియోగించరాదు.  
► అర్హత కలిగిన పెట్టుబడులు, సబ్సిడీలు, గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్స్‌ లేదా పన్ను మినహాయింపులు లేదా ఎంపిక చేసిన కార్యాచరణ ఖర్చుల రూపంలో గ్రీన్‌ బాండ్ల  ప్రభుత్వ వ్యయాలు ఉంటాయి.

మరిన్ని వార్తలు