కేసీసీ హోల్డర్లకు రుణాలివ్వండి

8 Jul, 2022 05:30 IST|Sakshi

బ్యాంకులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచన

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయాలకు ఊతమిచ్చే దిశగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (కేసీసీ) హోల్డర్లకు రుణాల లభ్యతలో ఇబ్బందులు లేకుండా, సజావుగా ఉండేలా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ) టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు కూడా అందించాలని పేర్కొన్నారు.

గురువారం పీఎస్‌బీల సీఈవోలతో భేటీలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేసీసీ స్కీమును సమీక్షించడంతో పాటు మత్స్య, పాడి పరిశ్రమకు సంస్థాగత రుణాల లభ్యత తదితర అంశాలపై చర్చించినట్లు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖ మంత్రి పర్షోత్తం  రూపాలా తెలిపారు. మరోవైపు, డిజిటలీకరణలో ఆర్‌ఆర్‌బీలకు స్పాన్సర్‌ బ్యాంక్‌ తగు సహకారం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కె కరాడ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు